వినూత్న నిరసన: భర్త చేతిలో హతమైన భార్యకు స్మారక స్థూపం
నల్లగొండ: భర్త చేతిలో హతమైన భార్యకు స్మారక స్థూపం నిర్మించి మహిళలు పురుషాహంకారాన్ని ధిక్కరించే పనికి పూనుకున్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో గత నెల 4వ తేదీన క్షణికావేశంలో భర్త మిర్యాల శ్రీశైలం భార్య పార్వతమ్మను రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు.
హత్యకు గురైన పార్వతమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శవంతో ఐదు రోజుల పాటు భర్త ఇంటి ముందు ఆందోళనలు చేపట్టినా స్పందించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు, మహిళా సంఘాలు భర్త ఇంటి ముందే శవాన్ని పూడ్చి వేసి అంత్యక్రియలు నిర్వహించిన విషయం విదితమే. కాగా శవాన్ని పూడ్చివేసిన చోటే పార్వతమ్మ స్మారక స్థూపాన్ని నిర్మించారు.

అక్కడ ఉన్న రెండు ఎకరాల భూమిని పార్క్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పార్వతమ్మ స్మారక స్థూపాన్ని బుధవారం జడ్పీటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పం చ్ అంతటి రమేష్, ఎంపిటిసి బాతరాజు ఆండాలు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ మహిళలపై క్షణికావేశాలకు లోనై దాడి చేసి హత్యలు చేయడం దారుణమన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించి మరో సంఘటన పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. స్ర్తిలను గౌరవించడం మన సాంప్రదాయమని పేర్కొన్నారు. భార్యలను హత్య చేసే భర్తలకు ఇదో గుణపాఠం కావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి, మహిళ సంఘాల నేతలు రొడ్డ లక్ష్మ మ్మ, రాధారపు సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications