ఏపీలో ఉచిత బస్సుతో కొత్త సమస్య..! తెరపైకి ఆ డిమాండ్..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ పథకం సాఫీగానే సాగిపోతోంది. మధ్యలో జగ్గయ్యపేటలో మహిళలు కొట్టుకోవడం, కేసులు పెట్టిన ఘటన మినహా పెద్దగా సమస్యలేవీ లేవు. దీంతో ఉచిత బస్సుకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పాటే మరో డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పథకం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. వీరి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుండటంతో ఆర్టీసీ అంచనాలు కూడా తప్పే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతంగా ఉండగా.. ఇప్పుడు ఉచిత పథకంతో 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోంది. అలాగే 13 జిల్లాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు.

మరోవైపు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందు 40 శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే, 60 శాతం మంది పురుషులు ప్రయాణించే వారు. ఇప్పుడు 65 శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే.. 35 శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. దీంతో పురుషులు, బాలురు, వృద్ధులు బస్సులు ఎక్కే పరిస్ధితి ఉండటం లేదు. దీంతో వారు ఇప్పుడు అదనపు సర్వీసులు నడపాలని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం విషయంలోనూ అధికారుల అంచనాలు దాటిపోతున్నాయి. దీంతో కొత్త బస్సుల కోసం ప్రభుత్వం ముందున్న ప్రతిపాదన తక్షణం అమలు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1100 కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ విద్యుత్ తో నడిచే బస్సులే. అయితే ఇవి ఇంకా ఆర్టీసీకి అందాల్సి ఉంది. ఆలోపు పురుషుల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోవడం పలు చోట్ల అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.












Click it and Unblock the Notifications