విజయవాడలో ఇళ్లకు నీటి మీటర్లపై విమర్శలు- అమృత్ పథకంపై నిరసనల వెల్లువ..
ఏపీలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయవాడలో ఇంటి కుళాయిలకు మీటర్లు బిగించడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భాగంగా పెడుతున్న ఈ మీటర్లపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణా నది తీరాన నీటి మీటర్లు పెట్టడం సిగ్గుచేటని జనం విమర్శిస్తున్నారు. అమృత్ పథకం పేరుతో విషతుల్యమైన షరతుల పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. నీటి మీటర్ల బిగింపుపై స్ధానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంచినీరు ప్రజల హక్కు, సరఫరా ప్రభుత్వ బాధ్యత అని రాజకీయపార్టీలు చెబుతున్నాయి.సహజ వనరులపై ప్రభుత్వ పెత్తనం,ఆదాయ వనరుగా పరిగణించటం తగదని నేతలు చెబుతున్నారు. నీటిమీటర్ల ఏర్పాటు నిలిపివేస్తూ మేయర్ ఆదేశాలు ఇవ్వాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు. నీటి మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంచేపడతామని హెచ్చరిస్తున్నారు.
విజయవాడలో నీటి మీటర్ల బిగింపుకు నిరసనగా రేపు నగరంలోని మధురానగర్, పసుపు తోటలో ఆందోళనకు కమ్యూనిస్టులు పిలుపిచ్చారు. నీటి మీటర్లకు వ్యతిరేకంగా విజయవాడలో పసుపు తోటలో ఇవాళ పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి వారు నీటి మీటర్లను పరిశీలించారు. ఇంటి యజమానులు లేని సమయంలో సమాచారం కూడా ఇవ్వకుండా నీటి మీటర్లు బిగించడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్లు ఎందుకు పెడుతున్నారో? అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించకుండా కాంట్రాక్టర్ల ద్వారా మీటర్లు పెట్టడం ఏమి న్యాయమని ప్రజలు ప్రశ్నించారు.చెత్త పన్ను, విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నులు, నిత్యవసర వస్తువుల ధరల ఇతర భారాలపై మహిళలు ప్రభుత్వాలను దుయ్యబట్టారు. పనులు లేక, ఆదాయాలు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో జనం ఉంటే నీటి మీటర్లు పెట్టి భారం వేయటం అన్యాయమని స్థానికులు విమర్శించారు. పెట్టిన మీటర్లు తొలగించాల్సిందేనని చెబుతున్నారు.
సహజ వనరులపై ప్రభుత్వం పెత్తనం చేయటం, పైపెచ్చు వాటిని వ్యాపార సరుకులుగా మార్చి ఖజానా నింపుకోవడం శోచనీయమని సీపీఎం సీనియర్ నేత బాబూరావు విమర్శించారు. మంచినీరు పొందటం ప్రజల ప్రాథమిక హక్కు, మంచినీటి సరఫరా ప్రభుత్వాల, స్థానిక సంస్థల కనీస బాధ్యత అన్నారు. అమృత్ పథకం పేరుతో విషతుల్యమైన విధానాలను చొప్పిస్తున్నారన్నారు. మంచినీటి సరఫరా మొత్తాన్ని బడా కంపెనీలకు కట్ట పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. పట్టణ సంస్కరణలు అనే ముద్దు పేరుతో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని బాబూరావు విమర్శించారు. రాష్ట్రంలో 33 పట్టణాల్లో అమృత్ పథకం పేరుతో మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. మోడీ జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ప్రజల నెత్తిన భారాలు రుద్దుతున్నారన్నారు.