జగన్ సర్కార్ కు షాక్- రఘురామ ఫిర్యాదుపై కేంద్రం స్పందన-సీఐడీ ఛీఫ్ పై చర్యలకు ఆదేశం
వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న పోరులో ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రఘురామరాజు రాస్తున్న లేఖలపై స్పందించిన కేంద్రం జగన్ సర్కార్ కు కీలక ఆదేశాలు ఇచ్చింది. అదీ వైసీపీ ప్రభుత్వంలో ఓ కీలక విభాగానికి అంతకంటే కీలకమైన అధికారిగా చెలామణీ అవుతున్న ఐపీఎస్ పై చర్యలకు కేంద్రం లేఖ రాసింది. దీంతో వైసీపీ సర్కార్ కు భారీ షాక్ తప్పలేదు. సదరు ఐపీఎస్ పై చర్యలు తీసుకుని తమకు నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని హోంశాఖ కోరింది.
జగన్ సర్కార్ కు భారీ షాక్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ జగన్ సర్కార్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై సీఐడీని ప్రయోగిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న ఆయనపై విపక్షాలు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఓ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై చర్యలకు కేంద్ర హోంశాఖ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఇది భారీ షాక్ గా మారింది.
సునీల్ కుమార్ విద్వేష ప్రసంగాలపై రఘురామ ఫిర్యాదు
సీఐడీ ఛీఫ్ గా బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్న పీవీ సునీల్ కుమార్ మతాల్ని రెచ్చగొట్టేలా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారంటూ ఈ ఏడాది వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ చర్యలు అఖిల భారత సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కేంద్రాన్ని కోరారు. సీఎం జగన్ కీలకంగా పరిగణిస్తున్న అధికారుల్లో ఒకరైన సునీల్ కుమార్ కు వ్యతిరేకంగా చర్యలకు రఘురామరాజు చేసిన ఫిర్యాదు అప్పట్లో కలకలం రేపింది. ఇప్పుడు దానిపై కేంద్రం స్పందించడంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది.
సీఐడీ ఛీఫ్ పై చర్యలకు కేంద్రం ఆదేశం
పీవీ సునీల్ కుమార్ పై రఘురామరాజుతో పాటు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ కన్వీనర్ వినయ్ జోషి కూడా గతంలో ఫిర్యాదు చేశారు. అయితే రఘురామ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు విద్వేష ప్రసంగాల వీడియోలతో కూడిన సీడీని కూడా కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపింది.
అఖిల భారత సర్వీసు అధికారిగా ఉంటూ విద్వేష ప్రసంగాలు చేసిన వ్యవహారంలో వైసీపీ ఎంపీ రఘురామరాజు పంపిన మూడు ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ గత నెల 25న ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఇందులో సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ పై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా ఏం చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక పంపాలని కూడా ప్రభుత్వానికి పంపిన లేఖలో ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోక తప్పని పరిస్దితి ఏర్పడింది.
రఘురామ అరెస్టులో కీలకంగా సునీల్ కుమార్
రెండు నెలల క్రితం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసి మంగళగిరి సీఐడీ ఆఫీసుకు తరలించడం, అక్కడ రఘురామరాజుపై దాడి చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో సైతం పీవీ సునీల్ కుమార్ పాత్రపై విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి సునీల్ కుమార్ పై రగిలిపోతున్న రఘురామరాజు కేంద్ర హోంశాఖకు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో రఘురామరాజు ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఆయనపై చర్యలకు ఆదేశించడమే కాకుండా నివేదిక కూడా ఇవ్వాలని ఏపీ సర్కార్ ను ఆదేశించింది. పీవీ సునీల్ కుమార్ హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేశారంటూ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదును హోంశాఖ సీరియస్ గా తీసుకోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.