లాక్ డౌన్ వేళ సరుకుల మధ్య దాక్కొని హైదరాబాద్ నుంచి విజయనగరానికి..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వలస కూలీల జీవితాలను దుర్భరంగా మార్చేస్తోంది. దీంతో ఉన్న చోటు నుంచి స్వస్ధలాలకు చేరుకునేందుకు వలస కూలీలు ఏదో ఒక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ స్వస్ధలాలకు చేరుకునేందుకు బయలుదేరుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ టూ విజయనగరం...
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో చిక్కుకున్న ఏపీలోని విజయనగరానికి చెందిన కూలీలు కొందరు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో అక్కడ బతకలేక ఎలాగైనా స్వస్ధలాలకు చేరుకునేందుకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న కూరగాయల వాహనాలను ఇందుకు ఎంచుకున్నారు.

రెండు వాహనాలు- రెండు రోజుల ప్రయాణం..
హైదరాబాద్ నుంచి రెండు వాహనాల్లో కూరగాయల మధ్య పడుకుని బయలుదేరిన 31 మంది వలస కార్మికులు రెండు రోజుల ప్రయాణం తర్వాత దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. దారిలో పలుచోట్ల ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి జిల్లాకు చేరుకున్న వీరు చివరికి చెక్ పోస్టుల వద్ద కాపలా కాస్తున్న పోలీసులకు దొరికిపోయారు.

తనిఖీల తర్వాత క్వారంటైన్ కు..
హైదరాబాద్ నుంచి నిత్యావసర సరకులతో విజయనగరం వచ్చిన రెండు వాహనాల్లో 31మంది వలస కార్మికులు దొంగతనంగా జిల్లాలోకి ప్రవేశించారు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరిన వీరంతా.. ఆ వాహనాలు చెక్పోస్టుల వద్దకు రాగానే సరకుల మధ్య దాక్కున్నారు. గత అర్ధరాత్రి దాటాక విజయనగరంలోని గజపతినగరం చేరుకున్నారు.
ఆ రెండు వాహనాల మీద అనుమానం రావడంతో పోలీసులు సరకులను పరిశీలించారు. అందులో 31 మంది ఉన్నారని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని పార్వతీపురం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అందరికీ వైద్యపరీక్షలు జరపనున్నారని పోలీసులు వెల్లడించారు.
వారంతా బొబ్బిలి, గజపతినగరం, పార్వతీపురం మండలాలకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.ఆ రెండు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.












Click it and Unblock the Notifications