మరోసారి మూడు రాజధానుల బిల్లు - విశాఖ నుంచే పరిపాలన..!!
మూడు రాజధానుల వ్యవహారంలో సీఎం జగన్ ముందుకే వెళ్లాలని భావిస్తున్నారా. మరోసారి మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీ ముందుకు రానుందా. ప్లనరీ వేదికగా ఎంపీ నందిగం సురేష్.. ఇప్పుడు మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మూడు రాజధానుల ప్రతిపాదన సభ ముందుకు తీసుకొచ్చారు.
ఆ తరువాత ప్రతిపక్షాలు - అమరావతి ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సభ ముందు మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టారు. శాసనసభలో ఆమోదం పొందినా.. మండలిలో రభసకు కారణమైంది. ఆ తరువాత మరోసారి సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశ పెట్టింది.

ప్రభుత్వం బిల్లులు ఉపసంహరణ
ఇక, దీని పైన అమరావతి వాసులు న్యాయపోరాటం చేసారు. ఆ తరువాత అనూహ్యంగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుతో పాటుగా.. సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణ సమయంలోనే సభలో సీఎం జగన్ ఈ బిల్లులను మరింత సమగ్రంగా సభ ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఈ పరిణామాల నడుమ హైకోర్టు దీని పైన గత మార్చిలో తీర్పు వెలువరించింది.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. నిర్మాణాలను పూర్తి చేయటానికి సమయం నిర్దేశించింది. అయితే, ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన అప్పీల్ కు వెళ్లలేదు. కోర్టు నిర్దేశించిన నిర్మాణాల సమయం మాత్రం ఆరు నెలలు కాదు.. అరవై నెలలు కావాలంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి కాని నిర్మాణాలను ప్రారంభించింది.

హైకోర్టు తీర్పు అమలు దిశగా
బ్యాంకుల రుణాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి పరిధిలోని కొన్ని భూముల అమ్మకానికి నిర్ణయించింది. ఇక, ఎన్నికల వరకూ మూడు రాజధానులు సాధ్యం కాదనే రాజకీయంగా అభిప్రాయం నెలకొని ఉంది. ఈ సమయంలోనే వైసీపీ నేతలు మరోసారి మూడు రాజధానుల బిల్లు అంశం పైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
కేబినెట్ లో మంత్రిగా ఉన్న అమర్నాద్ విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని.. మరో 2, 3 నెలల్లో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం చేసారు.

మరోసారి మూడు రాజధానుల ప్రస్తావన
దీంతో..హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ కు వెళ్లకుండా.. ఒక వైపు తీర్పు అమలు దిశగా అడుగులు వేస్తూ..మరోసారి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టటం సాధ్యమేనా.. న్యాయ పరంగా చిక్కులు రావా అనే చర్చ మొదలైంది.
మూడు రాజధానుల వ్యవహారం పైన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం అమరావతికే మొగ్గు చూపుతోంది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెబుతూనే..అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. దీంతో..ఏపీ రాజధాని వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ ఏం చేయబోతోందనేది మరోసారి ఆసక్తి కర చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications