జగన్ అస్త్రంతోనే కూటమి రివర్స్ ఉచ్చు- హిస్టరీ రిపీట్..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజకీయంగా జగన్ ను ఫిక్స్ చేయటం కోసం పావులు కదుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పదే పదే ఆరోపిస్తున్న కూటమి నేతలు ఇప్పుడు జగన్ లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా జగన్ హయాంలో జరిగిన భూ లావాదేవీల పైన ఫోకస్ చేసింది. జగన్ అండ్ టీం కు ఉచ్చు బిగిసేలా ఆధారాల సేకరణలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు స్పష్టం అవుతోంది.
అసెంబ్లీ వేదికగా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాడు విపక్షంలో ఉన్న చేసిన ఆరోపణలు విచారణకు సిద్దమైంది. ఇప్పటికే ఇసుక, లిక్కర్ అంశాల పైన సీఐడీ విచారణ చేస్తోంది. అదే విధంగా సోషల్ మీడియా పోస్టులు, వైసీపీ నేతల పై గతంలో ఉన్న అభియోగాల పైన విచారణ కొనసాగుతోంది. పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. లిక్కర్, ఇసుక అక్రమాల పైన సీఐడీ వైసీపీ నేతలు పలువురిని అరెస్ట్ చేసింది. ఇక, ఇప్పుడు జగన్ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసారు.

మంత్రి ప్రకటనతో
ఏపీ అసెంబ్లీ అసైన్డ్ భూముల వ్యవహారం పైన చర్చ జరిగింది. ఈ సమయంలో మంత్రి అనగాని కీలక అంశాలను ప్రస్తావించారు. 25వేల ఎకరాల అసైన్డ్ భూమలు గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారణ అయిందని మంత్రి వెల్లడించారు. ఆ రిజిస్ట్రేషన్లు ఆపేయమని ఆదేశాలు ఇవ్వటంతో పాటుగా రీ సర్వే చేయాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోని తప్పులను సరి దిద్దు తామని చెప్పుకొచ్చారు. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామని మంత్రి అనగాని శాసనసభలో ప్రకటించారు.
నాడు జగన్ ..నేడు కూటమి
గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విపక్ష నేతగా జగన్ ఇదే తరహాలో అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. జగన్ నాటి ఆరోపణల పైన శాసనసభలో పెద్ద వివాదమే చెలరేగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల పైన మంత్రుల కమిటీతో పాటుగా సీఐడీ విచారణ జరిగింది. పలువురు టీడీపీ మాజీ మంత్రుల పైన అభియోగాలు నమోదు చేసింది. ఇక, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం అదే ఇన్ సైడర్ ట్రేడింగ్ అస్త్రంతో జగన్ లక్ష్యంగా ఉచ్చు బిగిస్తోంది. ప్రజా దర్బార్ లో వస్తున్న వరుస ఫిర్యాదులు.. అధికారుల నివేదికల ఆధారంగా భూముల వ్యవహారంలో అక్రమాలు.. ఆధారా ల పైన ఫోకస్ చేసింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు కారణంగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications