ఆస్తులు అమ్మి రాజకీయాల్లో ఉన్నా : కొత్తగా సంపాదించింది ఏమీ లేదు : మంత్రి అనిల్ ఎమోషనల్ వెనుక..!!
వైసీపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉండే మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన ఆస్తులు..సంపాదన గురించి వివరించారు. తన పైన వస్తున్న ఆర్దిక పరమైన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాల పైన విరుచుకుపడే మంత్రి అనిల్ ఇలాంటి వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే చర్చ సాగుతోంది. అదే సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు రాజకీయంగా చర్చాకు కారణమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో యువనేతగా ఉంటూ జగన్ కు వీరాభిమాని అయిన అనిల్ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
సొంత పార్టీ నేతలకు టార్గెట్ గా అనిల్
ఊహించని విధంగా నెల్లూరు నుంచి సీఎం జగన్ గౌతమ్ రెడ్డితో పాటుగా అనిల్ కు తన కేబినెట్ లో స్థానం కల్పింటచమే కాకుండా..కీలకమైన ఇరిగేషన్ శాఖ అప్పగించారు. టీడీపీ హాయంలో దేవినేని ఉమా ఈ శాఖను నిర్వహించారు. అయితే, పార్టీ - ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే అనిల్ అదే విధంగా పోలవరం - ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అంతర్గత రాజకీయాల్లో అనిల్ టార్గెట్ అవుతున్నారు.
అనిల్ మంత్రిగా కంటిన్యూ అవుతారా
త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ లో అనిల్ ను తప్పిస్తారని..ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన క్రిష్ణా జిల్లా నేత మాజీ మంత్రి పార్ధసారధికి అవకాశం ఇస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే, మంత్రి అనిల్ సైతం కొంత కాలంగా గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కొందరు సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆవేదనతో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో..గతంలోని ఫైర్ ఇప్పుడు అనిల్ లో మిస్ అయినట్లు కనిపిస్తోంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు - మాజీ మంత్రి లోకేశ్ పైన అనిల్ విరుచుకుపడేవారు.
అనిల్ లో ఆ దూకుడు తగ్గటం వెనుక
అసెంబ్లీలో చంద్రబాబు ను ..మండలిలో లోకేశ్ ను టార్గెట్ చేయటంలో అనిల్ దూకుడుగా వ్యవహరించే వారు. కానీ, ఇప్పుడు ఆ దూకుడు కనిపించటం లేదు. ఇదే సమయంలో మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాతో పాటుగా వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. తాను కొత్తగా ఇల్లు నిర్మించుకున్నానని కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని.. కానీ తమ తండ్రి సంపాదించిన రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు ఇస్కాన్సిటీలో అమ్మి ప్రజాసేవ చేస్తున్నానని మంత్రి డాక్టర్ అనిల్ చెప్పుకొచ్చారు.
తన ఆస్తులు..ఆదాయం పైన అనిల్ వివరణ
నెల్లూరులోని సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. తమ తండ్రి నిర్మించిన ఇంటినే కొంత మార్పులు చేశానే తప్ప కొత్తగా నిర్మించలేదని, ఇప్పటికీ కొంతమేర ఆస్తులు ఉన్నాయని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సర్వేపల్లి ఆధునికీకరణ పనులు రూ.85 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేయిస్తుంటే ఆ పనులు మంత్రి అనిల్కుమార్ది అని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రూ.100 కోట్లతో పెన్నా బ్రిడ్జి టెండర్లు పిలుస్తామని, దమ్ముంటే టెండరు వేసుకోవాలన్నారు. కార్పొరేషన్లో అభివృధ్ధి పనులు వస్తున్నాయని, టెండర్లు వేసుకోవచ్చన్నారు.
నెల్లూరు జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు
అయితే, తన మీద విమర్శలు చేసే వారికి సవాళ్లు చేస్తూ..కౌంటర్ చేసే మంత్రి అనిల్ ఇలా వివరణ ఇచ్చింది సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి కోసమేనా అనే చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింద. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అదే సమయంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి కాదని..అనిల్ కు మంత్రి పదవి ఇచ్చిన సమయం నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది.
Recommended Video
మంత్రి పదవుల పైన భారీ అంచనాలతో
ఇక, ఇప్పుడు మరలా మంత్రివర్గ విస్తరణ చర్చలు సాగుతున్న సమయంలో..జిల్లా నుంచి ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అనిల్ జగన్ కేబినెట్ లో కంటిన్యూ అవుతారా.. లేక, సీఎం మంత్రి అనిల్ ను పక్కన పెడతారా అనే చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే, ముఖ్యమంత్రి నిర్ణయం నెల్లూరు జిల్లాలో మంత్రి పదవుల విషయంలో ఏ రకంగా ఉంటుందనేది మాత్రం అర్దం కాక.. జిల్లా నేతలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.