చంద్రబాబుది మురికి నోరు.. జల ప్రళయాలపై కూడా రాజకీయాలా? మంత్రి అనిల్ రివర్స్ ఎటాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ సర్కార్ వైఫల్యమే కారణమని, దీనికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చంద్రబాబునాయుడు చేస్తున్న డిమాండ్ పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జల ప్రళయం అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

కనీస అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు
ప్రాజెక్టు గేట్ల సామర్థ్యానికి మించి ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఉత్తరాఖండ్ లో కూడా ఇటువంటి ఘటన జరిగిందని, అక్కడ 150 మంది జలసమాధి అయ్యారు అనే విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వరదల సమయంలో అందర్నీ అప్రమత్తం చేశామని తెలిపిన మంత్రి అన్నమయ్య డ్యామ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కనీస అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తప్పుబట్టారు.

ప్రకృతి విపత్తులను కూడా ప్రభుత్వ వైఫల్యం గా చూపించే ప్రయత్నం
ప్రాజెక్టు కట్టు కొట్టుకుపోయిన ఘటన మానవ తప్పిదం అంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రకృతి విపత్తులను కూడా ప్రభుత్వ వైఫల్యం గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు కెపాసిటీ 2.13 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, కానీ గంటల వ్యవధిలో మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. భారీ వర్షాలు వస్తాయన్న హెచ్చరిక మాత్రమే ఉందని, వరద విషయంలో ఎలాంటి సమాచారం లేదని, ఒక్కసారిగా వరద ముంచెత్తటంతో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని పేర్కొన్నారు.

అన్నమయ్య ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రెస్ మీట్ చూశానన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
కేంద్ర ప్రభుత్వం చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు పట్టుకుని టీడీపీ యాగీ చూస్తుంటే జలప్రళయంలో కూడా ఇంత దిగజారి రాజకీయం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెనుక కూర్చున్న సీఎం రమేష్, సుజనా చౌదరి బహుశా కేంద్ర ప్రభుత్వానికి టిడిపి తరఫున ఒక పిట్ట కథ చెప్పి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అందుకే కేంద్ర ప్రభుత్వం నిరాధారమైన ప్రకటన చేసిందని పేర్కొన్నారు. అన్నమయ్య ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రెస్ మీట్ చూశానని పేర్కొన్న ఆయన అందులో చాలా విషయాలు దాచిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

చంద్రబాబు టైం లో వర్షాలే లేవు.. అయినా గేట్లు రిపేర్ చేయించలేదు
అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో కూడా అధికారులు రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేశారని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు ఒక గేటు రిపేరు చేయించడం తమకు కుదరలేదు అని చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు ఉన్న సమయంలో వర్షాలు పడలేదని అప్పుడు గేట్లకు మరమ్మతులు చేయించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు . డ్యాం సేఫ్టీకి 2017 లో కొత్త స్పిల్ వే కట్టించమంటే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించిన ఆయన చంద్రబాబు టైంలో నీళ్లు కూడా లేవని , అయినా మరమ్మతులు చేయించ లేదని ఎద్దేవా చేశారు. కానీ వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత వర్షాలు కురుశాయని డ్యాంలో నీళ్లు ఉండడం వల్ల రిపేర్ చేయించడం కుదరలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి మాటలు రబ్బర్ స్టాంపా? చంద్రబాబువన్నీ అబద్దాలే
కేంద్ర మంత్రి మాటలు రబ్బర్ స్టాంపా అని ప్రశ్నించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేంద్ర మంత్రికి చంద్రబాబు ఏజెంట్లు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎలాంటి సమాచారం ఇచ్చి ఉంటారో అందరికీ తెలుసంటూ విమర్శించారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి మేనేజ్మెంట్ చేశారో అందరికీ తెలుసని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. చంద్రబాబు, బోయపాటి షూటింగ్ వల్ల రాజమండ్రి పుష్కరాలలో ఎంత మంది చనిపోయారో తెలియదా అంటూ విమర్శించారు .చంద్రబాబుది మురికి నోరని, నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ కాదు చంద్రబాబే ప్రతిపక్షనేతగా అనర్హుడు అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై రివర్స్ ఎటాక్ చేశారు.

అంతకు ముందు జగన్ ను, వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు
అంతకు ముందు చంద్రబాబు అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని సీఎం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ కాలేదు. అది అప్పటికప్పుడు వచ్చిన సమస్య కాదన్న చంద్రబాబు ఇసుక కోసం వెళ్ళిన టిప్పర్ ల కోసం నీటిని విడుదల చెయ్యకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు రిపేర్డు చేయించలేని మీరు మూడు రాజధానులు కడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటనకు జగన్ ఏం సమాధానం చెప్తారని, ప్రజలను చంపేందుకు మీకు ఎవరు లైసెన్స్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా అనర్హుడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications