నేను అలా అనలేదు: జగన్ పత్రిక ఎఫెక్ట్తో అచ్చెన్న యూ టర్న్!
అమరావతి: నిరుద్యోగ భృతి పైన తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం నాడు చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో సమాచారం లేదని ఆయన అన్నారు.
నిరుద్యోగ భృతి పైన అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. చంద్రన్న పథకం ద్వారా రెండు కోట్ల మందికి భీమా కల్పిస్తున్నామని చెప్పారు. కాగా, ఆదివారం నాడు అచ్చెన్నాయుడు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో తన చాంబర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగ భృతిని ఇవ్వలేమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమయిందని విలేకరులు ప్రశ్నించారు దానిపై మంత్రి ఇవ్వలేమని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఇచ్చే భృతి పైన అధ్యయనం చేసినట్లు చెప్పారు.
అక్కడ చాలా తక్కువగా ఇస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశాల పైన దృష్టి పెట్టామన్నారు. ఇందుకోసం యూత్ పాలసీని తీసుకు రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ సబ్ ప్లాన్ మాదిరిగా యూత్ సబ్ ప్లాన్ కూడా తీసుకు రావాలని చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెడుతున్నట్లు చెప్పారు. కాగా, నిరుద్యోగ భృతిని ఇవ్వలేమని అచ్చెన్న చెప్పినట్లు ప్రధానంగా ప్రతిపక్ష నేత జగన్ పత్రిక సాక్షిలో వచ్చింది.