ఏందయ్యా.. నీ రాద్ధాంతం.. ఏంది ఉపయోగం?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పవన్ కల్యాణ్ రాద్ధాంతం చేయడం వల్ల గోరంత కూడా ఉపయోగం ఉండదనే విషయాన్ని గుర్తించాలన్నారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని, అందులో తప్పేం ఉందన్నారు. గతంలో కూడా ఇక్కడ భవనాలు ఉన్నాయని, విజయనగరం గుంకలాం వద్ద రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్షిప్ నిర్మిస్తున్నామన్నారు. అక్కడ జగనన్న కాలనీ పూర్తి చేయడానికి నాలుగు సంవత్సరాల సమయం పడుతుందన్నారు.
గుంకలాంలో ఇళ్ల సందర్శనకు వస్తానన్న పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అతిపెద్ద జగనన్న కాలనీ అని, 12 వేల మందికి పైగా లబ్ధిదారులకు లేఔట్ వేశామన్నారు. అక్కడ ఇళ్లు కట్టడంలేదని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, రూ.5 లక్షల విలువైన స్థలంతోపాటు ఇంటికి 1.50 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా వారికి అవసరమైన ఇనుము, సిమెంటు, ఇసుక అందుబాటులో ఉంచడంతోపాటు కాలనీలో 108 బోర్లు వేశామన్నారు. విద్యుత్తు సరఫరాతోపాటు రోడ్లు కూడా వేస్తున్నామని, గుంకలాంలో 8వేల మందికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తోందన్నారు. 2వేల మంది మాత్రం తామే కట్టుకుంటామన్నారని చెప్పారు.
ప్రభుత్వానికి, జనసేన పార్టీకి మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు.. వాటిపై పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీయడంలాంటి వాటితో ప్రారంభమై ఇరుపార్టీల మధ్య వ్యక్తిగత వైరం ప్రబలేస్థాయికి చేరాయి. తాజాగా గుంకలాంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను సందర్శించి అక్కడ జరుగుతున్న లోపాలను ఎండగడతామని జనసేన ప్రకటించింది.