50 వేల మందితో పాదయాత్ర - మంత్రి దాడిశెట్టి రాజా..!!
ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ అభివృద్ధి - పరిపాలన వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీరు పైన మండిపడ్డారు. ఆరు దశాబ్దాలకు పైగా అందరం కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాద్ రాష్ట్ర విభజనతో మనది కాకుండా అయిపోయిందని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణే సరైన మార్గంగా పేర్కొన్నారు.
50 వేల మందితో పాదయాత్ర
హైదరాబాద్ను కోల్పోయిన తరువాత ఎదురైన అనుభవాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్స్, కష్టాన్ని అంతా కాకినాడలో పెట్టాలని తాను 50 వేల మందితో పాదయాత్ర చేస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. తాను అమరావతి రైతులకు పోటీగా పాదయాత్ర చేస్తే అంగీకరిస్తారా అంటూ నిలదీసారు. రాష్ట్ర ప్రజలంతా పన్నులు రూపేణా కట్టిన మొత్తాన్ని తీసుకొని కేవలం 29 గ్రామాల్లోనే పెట్టుబడిగా పెట్టాలని డిమాండ్ చేయటం సరి కాదన్నారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి - పరిపాలన వికేంద్రీకరణ అవసరమని చెప్పుకొచ్చారు. కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు ఆరాట పడుతున్నారని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేది సీఎం జగన్ విధానమని మంత్రి వివరించారు.
హైదరాబాద్ అనుభవం మర్చిపోవద్దు
అమరావతి రైతుల పాదయాత్ర వెనుక చంద్రబాబు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. మళ్లీ రాష్ట్ర సంపద అంతా ఒకే చోట ఎందుకు పెట్టాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే కలిగే నష్టమేంటని ప్రశ్నించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మూడు రాజధానులకు అందరూ మద్దతివ్వాలని కోరారు. అమరావతిలోని కొంతమంది.. వారు చెప్పింది వినకపోతే రాష్ట్రాన్ని ఏవిధంగా నాశనం చేయాలని చూస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.
మూడు రాజదానులకు మద్దతుగా
ఇక్కడున్న మేధావులు, విద్యార్థులు ఆలోచించాని మంత్రి పిలుపునిచ్చారు. తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానుల పైన తన విధానం స్పష్టం చేసిన తరువాత కొద్ది రోజుల క్రితం విశాఖ కేంద్రంగా ఇదే తరహాలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇప్పుడు కాకినాడలో కొనసాగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రకమైన చర్చల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మూడు రాజధానుల వ్యవహారం పైన అటు న్యాయపరంగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్ర అసెంబ్లీకి నిర్ణయాధికారం ఉందని చెబుతూ..ఇప్పటికే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక, ప్రజల్లో ఈ మూడు రాజధానుల పైన చర్చ జరిగేలా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.