తన వ్యాఖ్యలపై ధర్మాన క్షమాపణలు .. రాజధాని యువరైతుతో ఫోన్లో మంత్రి
ఏపీలో మూడు రాజధానుల ప్రకటన నేపధ్యంలో రాజధాని రైతుల ఆందోళనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు . రాజధాని రైతుల ఉద్యమం బోగస్ అని అందులో ఉన్నవారంతా టీడీపీ కార్యకర్తలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాజధానిలో లింగులింగుమంటూ ఓ ఎనిమిది గ్రామాల వాళ్లు మాత్రం గొప్ప పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆయన హేళనగా మాట్లాడారు. పేపర్ల కవరేజ్ కోసమే అన్నట్టు వ్యాఖ్యానించారు.
రైతుల ఉద్యమం బోగస్ ..రాజధాని రైతుల ఆందోళనలపై మంత్రి ధర్మాన తీవ్ర వ్యాఖ్యలు
ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు 70 ఏళ్లుగా దిక్కులేకుండా బతుకుతున్నారని, అలాంటి తమకు లేని పోరాటం మీకెందుకు అంటూ రాజధాని ప్రాంత రైతులు ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. పత్రికల్లో బొమ్మలు వస్తున్నాయని, వాటిని చూసుకోవడం కోసమే కొంతమంది ఆందోళన చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మాన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రాజధాని తరలింపు వద్దు అమరావతి ముద్దు అంటూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతుల విషయంలో నోరుజారి విమర్శలపాలైన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రైతులకు క్షమాపణ చెప్పారు. ఆయన తన వ్యాఖలపై దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తన మాటను వెనక్కి తీసుకుంటున్నానని, రైతులు క్షమించాలని కోరారు. నిన్న జరిగిన ఓ సభలో అమరావతి రైతుల నుద్దేశించి ధర్మాన మాట్లాడుతూ 'లింగులింగు మంటూ ఎనిమిది ఏడూర్లవాళ్లు ఆందోళన చేస్తున్నారు' అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
రాజధానికి చెందిన ఓ ఓ యువ రైతు ధర్మానకు నేరుగా ఫోన్ చేశాడు. సార్...బాగున్నారా? అంటూ పలకరిస్తూనే సార్...మీరు ప్రయోగించిన లింగులింగుమంటూ... అన్న పదంతో ఇబ్బందిగా ఉంది సార్. ఆ మాట బాగోలేదు అని అన్నాడు. దీని పై ధర్మాన స్పందిస్తూ 'మీకు నచ్చలేదు కదా ఆ మాట. నన్ను క్షమించేయండి. అమరావతి వచ్చాక కలుద్దాం అంటూ రైతులకు వివరణ ఇచ్చారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు.