టీడీపీ విఫలం?: జగన్పై గంటా వ్యాఖ్యలు, వైసీపీకి నష్టం తప్ప లాభం లేదు
అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్ మా పార్టీ వైఫల్యాలను అందిపుచ్చుకొని వాటిని తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం అయ్యారని మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్యూలో పాల్గొన్న గంటా పైవ్యాఖ్యలు చేశారు.
"సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నా ఇంకా కొన్ని సమస్యలున్నాయి. జగన్ వాటిని గుర్తించి సరిగ్గా వ్యవహరించగలిగి ఉంటే, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందిపెట్టగలిగి ఉండేవారు. కానీ ఆయనలో రాజకీయ పరిపక్వత లోపించడం, సమస్యల పట్ల ఆవగాహనారాహిత్యం, తన పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్ళే గుణం లేకపోవడం చేత అందివస్తున్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. వాటిని సరిగ్గా ఉపయోగించుకొంటే ఆయన రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కలిగేది. ఇటువంటి లక్షణాలున్న ప్రతిపక్ష నేత ఉండటం టీడీపీ అదృష్టమనే చెప్పాలి. కనుక వచ్చే ఎన్నికలలో టీడీ విజయం సాధించడం 'కేక్ వాక్' అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను" అని అన్నారు.
అయితే మంత్రి గంటా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పాలన విషయంలో కొన్ని సమస్యలు, వైఫల్యాలను గుర్తించినట్టే తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ సమయంలో ఏపీకి ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూనే ఉంది.
ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం చంద్రబాబు పూర్తిగా నెరవేర్చలేదని వాదన కూడా ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. అయితే గంటా చెప్పినట్లుగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఏపీలోని సమస్యలపై పోరాకుండా చేతులు ముడుతుకొని కూర్చోలేదనే చెప్పాలి.
చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు. దొరికిన ప్రతి విషయాన్ని సద్వినియోగ పరచుకుంటూనే ఉన్నారు. తొలిసారి జరిగిన శాసనసభ సమావేశాలోత పోలిస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగన్ కాస్తంత రాజకీయ పరిణితిగానే కనిపించారు.
జగన్కు వచ్చిన సమస్య ఏంటంటే తన పార్టీలో అందరినీ కలుపుకొని సమిష్టి నిర్ణయాలు, వ్యూహాలు అమలుచేయకుండా తనకు తోచినట్లే పోరాటాలు చేస్తున్నారు. దీని వల్లే తనతో పాటు పార్టీకి కూడా రాజకీయ మైలేజి పొందకపోవడమే కాదు, రాజకీయంగా భంగపడుతూ వస్తున్నారు.
ఆకస్మికంగా గుంటూరులో ప్రత్యేకహోదా కోసం నిరాహార దీక్షకు కోర్చోవడం, రోజా సస్పెన్షన్ పై వ్యవహరించిన తీరు, రాజ్ భవన్ దగ్గర టీడీపీ ప్రభుత్వాన్ని కూలుస్తానని సవాల్ విసరడంతో పాటు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో దీక్షకు దిగడం లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు.
వీటి వల్ల వైసీపీకి నష్టం కలుగుతుందే తప్ప ఎటువంటి రాజకీయ లాభం కలగడం లేదు. జగన్ ఎప్పుడైతే కర్నూలులో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారో, ఆ మరుసటి రోజునే తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్లో చేరారు.
ఏపీకి ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వెనక్కి తగ్గినప్పుడు దానిని ఉపయోగించుకోవడంలో జగన్ వైఫల్యం చెందారు. ఇక తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్ ఈ నెల 10వ తేదీన దీక్షకు దిగుతారంటూ కార్యాచరణను ప్రకటించారు.
ఈ దీక్షతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒత్తిడిలోకి నెడతారేమో చూద్దాం.