బాలయ్య బాబు కాదు..తాత - మంత్రి అమర్నాధ్ : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇలా..!!
నందమూరి బాలకృష్ణ పై మంత్రి గుడివాడ అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అందరూ బాలకృష్ణ ను బాలయ్య బాబు అంటున్నారని...60 ఏళ్లు వచ్చాక బాబు కాదని తాతని వ్యాఖ్యానించారు. త్వరలోనే పాలనా రాజధానిగా విశాఖలో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. విద్యా సంవత్సరం పూర్తవుతూనే విశాఖ కేంద్రం పాలన ఏ సమయంలో అయినా ప్రారంభం అవుతుందన్నారు. చంద్రబాబు సభకు రోడ్ల పైన జనం లేకనే..సందుల్లో సభలు నిర్వహస్తున్నారని ఎద్దేవా చేసారు.
చంద్రబాబు సభల పేరుతో జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బాలయ్య సమరసింహరెడ్డి కాదన్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డి అంటున్నారని వ్యాఖ్యానించారు. బలయ్య సభకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నారు. చంద్రబాబు సభలకు ఎవరూ రావటం లేదన్నారు. కూరలు కొనటానికి.. పల్లీలు అమ్మటానికి వచ్చే వారితో సభలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనా మంత్రి అమర్నాధ్ స్పందించారు. అన్ని అంశాలను పరిశీలించి ఈవెంట్ కు అనుమతి ఇస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే బీఆర్ఎస్..కేఏ పాల్ పార్టీ ఒకటేనని అ భివర్ణించారు. వాటి గురించి చర్చ సమయం వృధా అన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కానీ మంత్రిగా ఉన్న అయ్యన్న ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి, గిరిజన ప్రాంతాలను కాపాడిన ఘనత వైసీపీదేనని పేర్కొన్న అమర్నాధ్ బ్యాక్ వర్డ్ రీజియన్ డెవలప్ మెంట్ కోసం కేంద్రం విడుదల చేసిన వందల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు.