కొడాలి నాని ఒంటరి పోరాటం: మంత్రి అనిల్- రోజా మౌనం వెనుక : అసలు కారణం అదేనా..!!
వైసీపీలో ఏం జరుగుతోంది. ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఒంటరి వారయ్యారా. టీడీపీ వ్యక్తిగతంగా కొడాలి నానిని టార్గెట్ చేస్తోంది. గుడివాడ కేంద్రంగా నాని క్యేసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు వేసిన ట్రాప్ లో వైసీపీ నేతలు చిక్కుకున్నారు. కరోనా వచ్చి మంత్రి కొడాలి నాని ఆస్పత్రిలో ఉన్న సమయంలో గుడివాడలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. పండుగ పూర్తయిన తరువాత మొదలైన మాటల యుద్దం.. రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇక, తాజాగా బుద్దా వెంకన్న మంత్రిని డైరెక్ట్ గా చంద్రబాబు ఇంటి గేట్ టచ్ చేస్తే శవంగా మారుతావంటూ హెచ్చరించారు.
మద్దతుగా నిలవని సహచర మంత్రులు
తన పైన వచ్చిన ఆరోపణలకు కొడాలి నాని ఒంటరిగానే కౌంటర్ ఇస్తున్నారు. కేబినెట్ సమావేశం తరువాత తన పైన వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే తానే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ కొడాలి నాని సవాల్ చేసారు. అదే కేబినెట్ పూర్తయిన తరువా మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో ఎవరు తప్పు చేసినా సీఎం సహించరంటూ సీఎం గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేసారు.
కానీ, తన జిల్లాకే చెందిన సహచర మంత్రి తప్పు చేయలేదని మాత్రం చెప్పలేకపోయారు. అదే విధంగా.. కొడాలి నాని పైన టీడీపీ నేతలు ఆ స్థాయిలో విమర్శల దాడి చేస్తున్నా.. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందించ లేదు. ఇక, పార్టీ ఫైర్ బ్రాండ్స్ గా పేరున్న మంత్రి అనిల్ కుమార్, నగరి ఎమ్మెల్యే రోజా ఈ మొత్తం వ్యవహారం తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరించారు.
వైసీపీ నేతల స్వీయ నియంత్రణ వెనుక
టీడీపీ - చంద్రబాబు పైన విరుచుకుపడే వీరిద్దరూ కొడాలి నాని కి మద్దతుగా తమ వాయిస్ వినిపించ లేదు. సొంత పార్టీ నుంచే మద్దతు కరువు అయిన సంగతి గుర్తించిన టీడీపీ నేతలు ఎప్పటి నుంచో లక్ష్యంగా చేసుకున్న మంత్రి కొడాలి నాని పైన రాజకీయంగా పెద్ద దుమారమే క్రియేట్ చేసారు. కానీ, వైసీపీ పైన విమర్శలు చేస్తే విరుచుకుపడే వైసీపీ ముఖ్యులు ముందుకు రాలేదు. స్వయంగా కేబినెట్ మంత్రిని శవంగా మారుస్తామంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వార్నింగ్ ఇచ్చినా వైసీపీ నేతల నుంచి స్పందన లేదు.
టీడీపీ నేతల విమర్శల పైన అంబటి రాంబాబు..తాజాగా పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. కొడాలి నాని వాదనకు మద్దతుగా నిలిచారు. టీవీల్లో కనిపించిన విజువల్స్ చూసిన వైసీపీ నేతలు గుడివాడలో నిజంగానే క్యేసినో జరిగిందా అనే అభిప్రాయం పైన ఆరా తీసినట్లుగా సమాచారం.
ఫైర్ బ్రాండ్స్ అనిల్ - రోజా సైతం
కొడాలి నాని తరుచూ చంద్రబాబును పదే పదే దూషించటం వలన పార్టీకి నష్టం కలుగుతుందనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు..ఇతర నేతలెవరూ ఈ విషయంలో స్పందించకుండా ఎవరైనా పెద్దలు నియంత్రించారా అనే మరో ఆసక్తి కర చర్చ వైసీపీ శ్రేణులో మొదలైంది.
లేక, నాని మాట తీరు గురించే పదే పదే విమర్శలు వస్తుండటంతో..కొడాలి నాని విషయంలో తమకెందుకులే అని మౌనంగా ఉండిపోయారా అనేది తెలియాలి. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు ఈ విషయంలో కొడాలి నాని కి సంబంధం లేదని... తనను సంప్రదించిన వారే కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని లే అవుట్ లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారని చెప్పుకొచ్చారు.
టీడీపీలో సమన్వయం..వైసీపీలో ఇలా
అయితే, ఇదే సమయంలో టీడీపీలో ఈ మధ్య కాలంలో ఏ నేత ఏ రకంగా స్పందించినా.. అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా నేతలంతా ఒకే మాట మీద ముందుకొస్తున్నారు. కానీ, కొడాలి నాని విషయంలో మాత్రం వైసీపీలో ఇప్పుడు అది కనిపించటం లేదు. నిత్యం టీడీపీ పైన ఫైర్ అయ్యే మంత్రి అనిల్.. రోజా వంటి వారు సైతం మౌనంగా ఉన్నారంటే వారికి వారుగా అలా మౌనం పాటించాలని డిసైడ్ అయ్యారా.. .లేక, వైసీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎవరూ ఈ విషయం పైన మాట్లాడవద్దనే సూచనలు అందాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
మంత్రి కొడాలి నాని సైతం తనకు మద్దతుగా పార్టీ నుంచి బలమైన వాయిస్ రాకపోవటం పైనా లోలోపల మనస్థాపంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video
టీడీపీ పై కొడాలి నాని ఒంటరి పోరాటం
కనీసం క్రిష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలు సైతం తమ వాయిస్ బలంగా వినిపించేందుకు ముందుకు రాలేదు. దీంతో.. కొడాలి నాని ఒక విధంగా తన పైన వచ్చిన ఆరోపణలకు తాను టీడీపీ పైన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా టీడీపీ అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ భవిష్యత్ లోనూ కొడాలి నాని లక్ష్యంగా అడుగులు వేయటం ఖాయంగా కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో గుడివాడ పైన ఇప్పటికే ఫోకస్ చేసినట్లుగానూ తెలుస్తోంది. దీంతో..ఇటు ప్రతిపక్ష టీడీపీ రాజకీయం..స్వపక్షం నుంచి ఇటువంటి సందర్భాల్లో లభించని మద్దతు..ఈ పరిస్థితుల్లో కొడాలి నాని ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.