"జగన్లో ఆ భయం.. ప్రపంచానికి ఐసిస్లా ఏపీకి ఆయన ప్రమాదకరం"
ప్రపంచానికి ఐసిస్, ఏపీకి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడ: టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీ అధినేతపై సంధిస్తున్నారు. కుల, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించగా.. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా అవే వ్యాఖ్యలు చేశారు.
నంద్యాలలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నారని కొల్లు ఆరోపించారు. నంద్యాలలో ఓడిపోతామన్న భయం జగన్లో కనబడుతోందన్నారు. ఐసిస్ ప్రపంచానికి ప్రమాదకరమైతే... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా నంద్యాల ప్రజలు స్వేచ్చగా ఓటేయాలని కొల్లు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ప్రజలు టీడీపీకే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని, ఓటమి భయంతోనే జగన్ ఎన్నికల వాయిదాకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.