vizag fire accident:50 అడుగుల వరకు మంటలు, ప్రమాదంపై మంత్రి గౌతమ్ ఆరా..(వీడియో)
విశాఖపట్టణంలో మరో భారీ ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలో గల రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు 50 అడుగుల వరకు ఎగిసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రమాదం గురించి ఆరా తీసి.. తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజీ ఘటన మరవకముందే మరో భారీ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Recommended Video

మంత్రి ఆరా..
ప్రమాదంపై జిల్లా అధికారులతో మంత్రి గౌతమ్ ఆరాతీశారు. ప్రాథమిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికంగా ఉన్న ప్రజలు, ఫార్మాసిటీ పరిధిలో నైట్ షిప్ట్ విధుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రమాదం దృష్ట్యా ఎవరికీ ప్రాణ నష్టం కలుగకుండా చూడాలని పోలీసు సిబ్బంది, అగ్నిమాపక అధికారులకు స్పష్టంచేశారు. ఆ మేరకు వారు చర్యలు తీసుకున్నారు. సమీపంలో గల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడితే వెంటనే వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వైద్యులను అందుబాటులో ఉంచారు.

50 అడుగుల వరకు మంటలు
ఫార్మాసిటీ ప్రమాదంతో మంటలు 50 అడుగుల వరకు ఎగిసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగిసిపడ్డ ప్రదేశంలో ఇప్పటికీ 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి అయితే ప్రమాదస్థలికి దూరంగా ఫైరింజన్లు ఆగిపోయాయని.. సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి అని పరిసర ప్రజలు చెప్పారు.

12 ఫైరింజన్లు
ప్రమాద స్థలికి అనకాపల్లి పరిధి నుంచి 12 ఫైరింజన్లు చేరుకున్నాయి. 200 మీటర్ల వరకు వేడి తీవ్రత ఉండటంతో వెళ్లడం కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రెండు ఫోమ్ యంత్రాలతో మంటలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థలో విధుల్లో ఉన్నది నలుగురేనని తెలుస్తోంది.
సీనియర్ కెమిస్ట్ కాండ్రేగుల శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో గాజువాకలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం ఇలా..?
సాల్వెంట్ రికవరీ కాలమ్లో ప్రమాదం జరిగింది. కంపెనీ సమీపంలో ఉన్న రసాయనాల డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించడంతో భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఆ శబ్ధాల ధాటికి స్థానికులు గజ గజ వణికిపోయారు. ఆ శబ్దం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయని పరిసర ప్రజలు చెబుతున్నారు. మంటలు కూడా 30 నుంచి 50 అడుగులు ఎత్తువరకు ఎగజిమ్మడంంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఫార్మాసిటీ సమీపంలో గల హెచ్ టీ విద్యుత్ లైన్లు వేడి తీవ్రతకు తెగి కిందపడ్డాయి. ప్రమాదంతో సమీపంలో గల ఫార్మా కంపెనీలో నైట్ షిప్ట్ చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయంతో పరుగుతీశారు.

భయంతో పరుగులు
మంటలు మరింత వ్యాపించడంతో సమీపంలో గల ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రమాదంలో గాయపడ్డారే తప్ప.. ప్రాణనష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు. మరోవైపు మిగిలిన పరిశ్రమలు సురక్షితం అని అధికారులు తెలిపారు. సమీపంలో మరో 85 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇతర కంపెనీలకు ప్రమాదం వాటిల్లలేదు అని ఫార్మాసిటీ సీఈవో లాల్ కృష్ణ చెప్పారు. ఫార్మాసిటీ పరిసరాల్లో గల తానాం, పరవాడ, తాడి, లంకెలపాలెం, ఈబోసంగి, గొర్లువానిపాలెం ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
15 రకాల రసాయనాలు
సాల్వెంట్స్ కంపెనీ రసాయనాలను శుద్ది చేసి ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. 15 రకాల రసాయనాలు ఇక్కడ నిల్వ చేస్తారు. భారీగా రసాయనాలు నిల్వ ఉండటమే ప్రమాద తీవ్రతకు కారణమని అనుమానిస్తున్నారు. కంపెనీ ఆవరణలో 5 రియాక్టర్లు ఉన్నాయని.. వీటిలో ఒకదాని నుంచి పేలుడు జరిగిందని తమకు సమాచారం వచ్చిందని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications