అంతవరకే: ర్యాగింగ్పై మృణాళిని, 'రిషికేశ్వరి కేసులో వక్రీకరణ, మేం చెప్పాకే ఫిర్యాదు'
గుంటూరు/చిత్తూరు: జూనియర్ల విషయాలు తెలుసుకునేంత వరకే సీనియర్లు పరిమితం కావాలని మంత్రి మృణాళిని గురువారం అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ర్యాగింగ్ పాశవిక చర్యగా మారకూడదన్నారు. జూనియర్ల విషయాలు తెలుసుకునేంత వరకే అది ఉండాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకూ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి గురువారం మండిపడ్డారు. బాబురావు అనే వ్యక్తి ప్రిన్సిపల్గా ఉండి, ఆయన చేస్తున్న చేష్టల వల్ల రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
రిషికేశ్వరి ఆత్మహత్యకు ఆయనే కారణమని విశ్వవిద్యాలయం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ నిర్ణయించిందన్నారు. జరుగుతున్న తప్పులను అరికట్టేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రిన్సిపల్ స్వయంగా బాధ్యుడైన మొదటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని మరో నేత గౌతమ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మేం గట్టిగా అడిగిన తర్వాతే ఫిర్యాదు చేశారన్నారు.
బాబురావుపై ఫిర్యాదు
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో సస్పెండైన ప్రిన్సిపల్ బాబురావు పైన రిజిస్ట్రార్ రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీలో ర్యాగింగ్ను బాబురావు నిరోధించలేకపోయారని ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని రిజిస్ట్రార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.