'జగన్ అసలు రూపం బయటపడింది', 'పవన్ జతకలిశారు, గడ్కరీకి లేనిపోనివి చెప్పారు'
Recommended Video
అమరావతి: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ప్రకటనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అసలు రూపం బయటపడిందని ఏపీ మంత్రి నారా లోకేష్ శనివారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
ఆ రోజూ చూస్తూనే ఉన్నా, ఫోన్ రాగానే.. ఇది జరిగింది!: పవన్పై జేసీ కొడుకు సంచలనం
ఇంత వరకు తెర వెనుక నడిచిన రాజకీయం ఇప్పుడు తెర బయటకు వచ్చిందని చెప్పారు. జగన్ ఎన్డీయేలో చేరుతారన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు విషయం వెలుగు చూసిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ నేతల వద్ద తాకట్టు పెడితే క్షమించరన్నారు.
తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు
2019 ఎన్నికల్లో బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల కలయికకు పరాజయం తప్పదని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు ట్రయలర్ నడిచిందని, జగన్కు అథవాలే ఆహ్వానంతో అసలు సినిమా వెలుగు చూసిందన్నారు. వారు కలిసి, తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుతుంటే మౌనంగా చూస్తూ కూర్చునేందుకు తెలుగు ప్రజలు ప్రజలు ఫూల్స్ కాదన్నారు. 2019లో వారు ఫ్లాప్ అవుతారన్నారు.
పవన్ కూడా జతకలిశారు, గడ్కరీకి లేనిపోనివి చెప్పారు
జగన్కు అథవాలే ఆహ్వానంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అంతకుముందు చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు పవన్ కూడా ఆ బ్యాచ్లో చేరారన్నారు. భూమి విస్తీర్ణం పెరగడమన్నది నిజం కాదని, ప్రాజెక్టు ఎత్తుని బట్టే అది ఉంటుందని, అది ఎవరూ మార్చేది కాదని, బీజేపీ నాయకులు ఉప్పందించడం వల్లే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేనిపోని అనుమానాలు వచ్చాయన్నారు.
ఈ పని జరగలేదని చెప్పలేకపోతున్నారు
ఏపీలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని పనులూ చేశామని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. వైయస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రభుత్వంపై, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కానీ అక్కడ ఈ పని జరగడం లేదని చెప్పలేకపోతున్నారన్నారు.
రాజీనామాలు త్యాగాలు కాదు!
ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరాడాల్సిన సమయంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి సమయంలో వారు రాజీనామా చేసి, కేంద్రంపై పోరాడే విషయంలో తప్పించుకున్నారని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు రావని తెలిసీ రాజీనామా చేశారని, అలా రానప్పుడు రాజీనామాలతో ఫలితం ఏముందన్నారు. ఢిల్లీలో పోరాడలేక రాజీనామాలు చేసి, ఇక్కడ త్యాగాలు అని చెబుతోందన్నారు.