కేశినేని చెప్పింది వాస్తవం: మంత్రి నారాయణ, సరికాదు: అయ్యన్న
విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పైన మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడులు వేర్వేరుగా స్పందించారు. నాని అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై నారాయణ మాట్లాడుతూ.. కేశినేని నాని చెప్పింది వాస్తవమే అన్నారు. అధికారులతో సమన్వయ లోపం ఉందన్నారు. అన్ని సమస్యలను త్వరలో అధిగమిస్తామని చెప్పారు. మరో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ.. కేశినేని వ్యాఖ్యలు సరికాదన్నారు. విజయవాడకు ఏమీ ఇవ్వలేదన్న నాని వ్యాఖ్యలు సరికాదని, బెజవాడకు రాజధానే ఇచ్చారన్నారు. ఎవరైనా పార్టీ తర్వాతేనని, పార్టీయే గొప్పదన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని అందరు పని చేయాలన్నారు.
మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్ర రావులు తమ పార్టీలో చేరుతారనే అంశాన్ని తాను మీడియాలోనే చూస్తున్నానని తెలిపారు. పార్టీలో చేరే వారి విషయంలో అంతిమ నిర్ణయం పార్టీ అధినేతదేనని చెప్పారు. అధికారులను తమకు అనుగుణంగా పని చేసేలా మలచుకోవాలన్నారు. కొందరు అధికారులు ఇంకా కాంగ్రెస్ పాలన ఉన్నట్లుగా భావిస్తున్నారన్నారు.

మరోవైపు, కొణతాల, దాడిలు పార్టీలోకి రావడంపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఎవరికైనా అసంతృప్తి ఉంటే పార్టీలో చర్చించాలి తప్ప బయటకు కాదని గంటా అన్నారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా అభ్యంతరం లేదన్నారు. అయ్యన్నతో విభేదాల్లేవన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ఆరు నెలల పాలనపై ఆ పార్టీ పార్లమెంటుసభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యవహారంపై, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దానిపై దేవినేని కూడా స్పందించారు. ఎంపీ కేశినేని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. జిల్లా సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతోనే పనిచేస్తున్నారని మంత్రి వివరణ ఇచ్చారు. సీఆర్డీఏకి సీఎం చంద్రబాబు చైర్మన్గా ఉంటారని, విజయవాడను సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు ఇదే మంచి అవకాశమని అన్నారు.












Click it and Unblock the Notifications