ప్రశాంతతకు మారు పేరు తూగో, కచ్చితంగా జగన్ పనే: కాపు నేతలలో చంద్రబాబు
అమరావతి: కాపులను బీసీల్లో చేర్చే ఆంశంపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం కీలక సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమావేశానికి కాపు సామాజికి వర్గానికి చెందిన మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
కాపులను బీసీల్లో చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే ఇందులో ఉన్న అంశాలను కూలంకుషంగా పరిశీలించడానికే కాపు కమిషన్ వేశామని చంద్రబాబు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. గతంలో విడుదలైన జీవో 30లోని అంశాలను గురించి కాపు నేతలకు ఈ సమావేశంలో వివరించారు.

జీవో నెం.30 అనేది ప్రకటన మినహా రిజర్వేషన్లు ఖరారు చేసిన ఉత్తర్వు కాదని అ్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరని, తుని హింస కచ్చితంగా జగన్ ప్రేరిపిత అసాంఘిక శక్తుల పనేనన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరచడమే అసాంఘిక శక్తుల ఉద్దేశమన్నారు.
రిజర్వేషన్లు అంశం అత్యంత సున్నితమైనదని, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన కాపు నేతలకు నచ్చ చెప్పారు. అంతేకాదు ఇప్పటివరకూ జారీ చేసిన జీవోలు, కోర్టులు వివిధ సందర్భాల్లో వెలువరించిన తీర్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, జీవో 30లో ఏముందో వివరించారు.
మంజునాథ్ కమిషన్ 9 నెలల్లో చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తిచేసి నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా బీసీలకు ఎలాంటి నష్టం కలగకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు చంద్రబాబు నాయుడు వారికి వివరించినట్లు సమాచారం. బీసీ సంక్షేమంపై సాయంత్రం సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
మరోవైపు కాపులను బీసీల్లో చేర్చకుంటే ఈ నెల 5 నుంచి తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం సోమవారం ప్రకటించిన నేపథ్యంలో మంత్రి నారాయణ మంగళవారం స్పందించారు. ముద్రగడ పద్మనాభం ఎందుకు నిరాహార దీక్షకు దిగుతున్నారో స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే 30 జీవో వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు. మంగళవారం సాయంత్రం కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారని చెప్పారు. కాగా, సీఆర్డీఏ పరిధిలో రహదారుల కోసం 6 గ్రామాల్లో 1200 ఇళ్లు తొలగించాల్సి ఉంటుందన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ పై చర్చించేందుకు బుధవారం సింగపూర్ బృందం ఆంధ్రప్రదేశ్కు వస్తోందన్నారు. ఈ నెల 15వ తేదీ లోగా ఏపీ రాజధాని ఫైనల్ మాస్టర్ప్లాన్ ను రూపొందించనున్నట్లు నారాయణ వెల్లడించారు. బుధవారం నుంచి తాత్కాలిక రాజధాని టెండర్లు తెరుస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో తనకు భూములు లేవని నారాయణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications