అమరావతికి చేరిన హిందూపురం పంచాయితీ: జగన్ చెబితే వదిలేస్తా!!
''ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హిందూపురం వదిలేయండి'' అని చెబితే తాను నియోజకవర్గాన్ని వదిలేసి బయటకు వెళ్లిపోతానని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఖరాఖండిగా తేల్చిచెప్పారు. కొన్నాళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొలనొప్పిగా మారిన హిందూపురం పంచాయితీని పరిష్కరించడానికి మంత్రి పెద్దిరెడ్డి సెక్రటేరియట్లో అసంతృప్త నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ వర్గాలకు చెందినవారు మంత్రి పెద్దిరెడ్డికి ఇక్బాల్ పై ఫిర్యాదు చేశారు. మంత్రి సమక్షంలోనే అసంతృప్త నేతలంతా వాగ్వాదానికి దిగారు. ఆయన వల్ల తామంతా ఇబ్బందులు పడుతున్నామని, ఈసారి ఎన్నికల్లో ఇక్బాల్ కు కాకుండా ఎవరికి సీటిచ్చినా పర్వాలేదని, స్థానికులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికేతరుడైన ఇక్బాల్ తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు సీటిస్తే సహించేది లేదన్నారు.
నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జిగా ఉంచినా పర్వాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇస్తే తాము పనిచేసేది లేదని అబ్దుల్ ఘనీ, నవీన్ నిశ్చల్ తేల్చిచెప్పారు. పార్టీ ఆదేశిస్తే నియోజకవర్గాన్ని వదిలివెళ్లేందుకే తాను సిద్ధమేనని ఇక్బాల్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ చెబితే హిందూపురం వదిలి వెళ్లిపోతానన్నారు. ఇరువర్గాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి ఈ విషయం ఇలా తేలేది కాదని భావించి ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.