పీఆర్సీపై దుష్ప్రచారం.. ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని సీరియస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీపై ఉద్యోగ , ఉపాధాయ సంఘాలు రగిలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు దిగాయి. జిల్లా కలెక్టరేట్ల ముట్టడితో దద్దరిల్లాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. లేని పక్షంలో తమ సత్తా ఎంటో చూపిస్తామని హెచ్చరించాయి. తాజాగా ఉద్యోగుల ఆందోళనపై మంత్రి పేర్నినాని తీవ్రంగా స్పందించారు. యూనియన్ నేతలే ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరవో చెప్పిన మాటలు విని సమ్మె వెళ్లొద్దని కోరారు.
ఉద్యోగులను తప్పుదోపట్టిస్తున్న యూనియన్ నేతలు
ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందనేని అవాస్తమన్నారు మంత్రి పేర్నినాని. ఉద్యోగులు తమ మొత్తం జీతం పెరిగిందా.. లేదా అనేది చూడాలని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు ఆశించనమేరకు పీఆర్సీ ఇవ్వలేకపోవడం బాధాకరమే అని అన్నారు. ఉద్యోగులను యూనియన్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.
హెచ్ఆర్ఏ అనేది జీతభత్యాల్లో భాగం కాదా?
గతంలో ఎన్నడూ లేని విధంగా 27 శాతం ఐఆర్ ఇచ్చామని మంత్రి పేర్నినాని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే ఐఆర్ ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఐఆర్ కింద రూ. 17,918 కోట్లు ఉద్యోగులకు ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఐఆర్ను జీతంలో భాగంగా ఎలా పరిగణిస్తారు. హెచ్ఆర్ఏ అనేది కూడా జీతభత్యాల్లో భాగం కాదా అని నీలదీశారు. అన్ని అంశాలను తెలిసి కూడా ఉద్యోగుల ఐఆర్ పై వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి
పీఆర్సీపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నాని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనే దాంటో వాస్తవం లేదన్నారు. గతంలో ఉన్న విధానాన్నే ఇప్పుడు అమలు చేశామని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దని పేర్నినాని విజ్ఞప్తి చేశారు.