వైసీపీ ఎమ్మెల్యేలతో మంత్రి విశ్వరూప్- జగన్ దృష్టికి..!!
అమలాపురం: రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెటూళ్లన్నీ కళకళలాడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు పల్లెబాట పట్టారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి వందల సంఖ్యలో తెలుగు ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుంటోన్నారు. హైదరాబాద్ వందల సంఖ్యలో వాహనాలు ఏపీ వైపు పరుగులు పెడుతున్నాయి. ఫలితంగా- టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగింది. టోల్ గేట్ దాటడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది.
బస్సులు, రైళ్లు ఫుల్..
అటు హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లే వారితో బస్టాండ్, రైల్వే స్టేషన్లు క్రిక్కిరిసిపోతున్నాయి. కొద్దిరోజుల ముందే షెడ్యూల్ ఆర్టీసీ బస్సుల్లో సీట్లన్నీ బుక్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్నారు. ఇదివరకు ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సాధారణ ఛార్జీలనే తీసుకుంటోన్నారు.
కోడి పందాలపై..
ఏపీలో సంక్రాంతి పండగ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది- కోడి పందేలు. వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు నమోదవుతుంటాయి ఈ ఈవెంట్లో. సంక్రాంతి నాడు కోడిపందాలను నిర్వహించడం కోనసీమ జిల్లాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇది చట్టవ్యతిరేకం కావడం వల్ల దీన్ని నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. ఎవ్వరు నిర్వహించినా దానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తుంటారు.
మూడు రోజుల్లో..
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలను నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. అమలాపురం, భీమవరం, రాజోలు వంటి చోట్ల కోట్ల రూపాయల మేర చేతులు మారుతుంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు రోజుల్లో వందల సంఖ్యలో కోడిపందాలు జరుగుతుంటాయి. అదే స్థాయిలో కోట్ల రూపాయల మేర లావాదేవీలు నమోదవుతుంటాయి.
నో పర్మిషన్..
ఈ ఏడాది కూడా కోడి పందాల నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రచారం కూడా చేస్తోన్నారు. కోడిపందాల నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోన్నారు. అయినప్పటికీ- కోడి పందాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి.
అనుమతుల కోసం..
కోడిపందాల నిర్వహణ వ్యవహారం అటు రాజకీయంగా కూడా ముడిపడి ఉన్నందున అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడానికి తక్షణ చర్యలను తీసుకుంటోన్నారు. కోడిపందాల నిర్వహణకు అవసరమైన అనుమతులను పోలీసు యంత్రాంగం నుంచి తెప్పించుకోవడానికి కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి పినిపె విశ్వరూప్ స్వయంగా బరిలో నిలిచారు.
మంత్రి భేటీ..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఇందులో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా వస్తోన్న నేపథ్యంలో కోడిపందాలకు పుల్ స్టాప్ పెట్టడం సరికాదని, పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ- బహిరంగంగానే వాటిని నిర్వహించే పరిస్థితులు ఉన్నాయని మంత్రికి వివరించారు. ఇలాంటి సమయంలో అధికారికంగా అనుమతులు ఇవ్వడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని విశ్వరూప్ వారికి హామీ ఇచ్చారు. భోగి పండగ నాటి నుంచే కోళ్ల పందాలు ఆరంభం కావాల్సి ఉంది.