దావోస్ లో జగన్ ఈగలు తోలుకుంటున్నారు.. మంత్రి పువ్వాడ వ్యాఖ్యల వీడియోతో టీడీపీ రచ్చ
ఒకపక్క తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం జగన్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ మా సోదరుడితో మంచి సమావేశం జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి మరీ వారి మధ్య ఉన్న సఖ్యతను తెలియజేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర మంత్రి మాత్రం జగన్ ని టార్గెట్ చేసి మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది స్టేట్ అయిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మళ్లీ వైయస్ జగన్ దావోస్ పర్యటనను టార్గెట్ చేశారు.
మంత్రి కేటీఆర్ కు పొగడ్తలు .. జగన్ పై సెటైర్లు వేసిన మంత్రి పువ్వాడ
మంత్రి కేటీఆర్ పెట్టుబడులు తెస్తున్న తీరును ప్రశంసిస్తూ, పక్క రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు ఈగలు తోలుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారాయి. కేటీఆర్ సహచర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కోసం పెట్టుబడి వరద పాటిస్తుంటే, ఎవరూ రాక, ఎవరు పెట్టుబడులపై ఆసక్తి చూపించక పక్క రాష్ట్రాల సీఎంలు ఈగలు తోలుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
పువ్వాడ అజయ్ వ్యాఖ్యల వీడియో షేర్ చేసి పరువు తీస్తున్న టీడీపీ
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో అడుగు పెట్టిన రోజే వెయ్యి కోట్ల పెట్టుబడులు తెచ్చారని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈగ వాలిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు . ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధికారం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరువు తీస్తోంది. పక్క రాష్ట్రాల మంత్రులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఏం చెబుతున్నారో వినాలి అంటూ సెటైర్ వేస్తుంది. జగన్మోహన్రెడ్డి విదేశాల్లో కూడా పరువు పోగొట్టుకున్నారని, దావోస్ లో జగన్ రెడ్డి అండ్ కో ఈగలు తోలుకుంటున్నారు అని తెలంగాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారని ఎద్దేవా చేస్తుంది.
విదేశీ పెట్టుబడుల విషయంలో బీహార్ తో ఏపీ పోటీ.. టీడీపీ విమర్శలు
విదేశీ పెట్టుబడుల విషయంలో రోజు రోజుకూ దిగజారి బీహార్ తో పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. గతంలో చంద్రబాబు హయాంలో పెట్టుబడుల విషయంలో టాప్ ఫైవ్ లో ఏపీ ఉండేదని తాజాగా కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 14వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడిపోయిందని .. జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం గా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తోంది టిడిపి.
తెలంగాణా పెట్టుబడుల విషయంలో దూసుకుపోతుంది.. ఏపీ విఫలం అవుతుంది
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల విషయంలో దూసుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయాలో అంతు పట్టడం లేదని, జగన్ తనతో పాటు మంత్రులు అమర్నాథ్, మిథున్ రెడ్డిలను, అధికారులను తీసుకువెళ్ళారని, ఇక మంత్రి కేటీఆర్ కేవలం అధికారులతో వెళ్ళారని , అయినా తెలంగాణాతో పోల్చుకుంటే జగన్ పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమవుతున్నారని జగన్ దావోస్ పర్యటనను టీడీపీ అడుగడుగున టార్గెట్ చేస్తుంది. ఏపీలో పాలన చూసి పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ ముందుకు రావటం లేదని విమర్శిస్తుంది.
టీడీపీకి ఆయుధంగా తెలంగాణా మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు
ఇక ఇదే సమయంలో పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఆయుధంగా మారాయి. జగన్ పెట్టుబడులు తీసుకురావడంలోవిఫలమవుతున్నారని తాము చెప్పడం లేదని పక్క రాష్ట్రాల మంత్రులు చెబుతున్నారని, జగన్ పనితీరుపై తెలంగాణ మంత్రి పబ్లిక్ గా చెప్పి పరువు తీస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తుంది. దీనికి వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు అని ప్రశ్నిస్తుంది.