నాగబాబుకు మంత్రి రోజా దిమ్మతిరిగే కౌంటర్.. ఆ వీడియో క్లిప్పింగ్స్
అమరావతి: పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా.. జనసేన పార్టీ నాయకుడు నాగబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో తనను తప్పుపడుతూ ఆయన చేసిన విమర్శలను అదే రేంజ్ లో తిప్పికొట్టారామె. నోటికి ఎంత వస్తే అంత వాగడం- రాజకీయం అని అనిపించుకోదని హితవు పలికారు. తనపై, తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పర్యాటక శాఖ అభివృద్ధిపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు- ఆయన అజ్ఞానానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
లక్షలాది మంది అర్చకులకు జగన్ సర్కర్ గుడ్ న్యూస్: నూటికి నూరు శాతం
విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చెయ్యాలి లేదా 😷 నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం మీకే చెల్లుతుంది. ఏపి గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు, నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం NagaBabuOffl నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం!! pic.twitter.com/m1FCwniteM
— Roja Selvamani (RojaSelvamaniRK) January 7, 2023
నాగబాబు ఏం చెప్పారు?
పర్యాటక శాఖ అభివృద్ధిలో రాష్ట్రం 18వ స్థానానికి దిగజారిపోయిందంటూ నాగబాబు విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన మంత్రి రోజా వైఖరిని తప్పుపట్టారు. పర్యటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని చురకలు అంటించారు. జగన్ ప్రభుత్వ పరిపాలన ముగిసే నాటికి పర్యాటక శాఖలో ఏపీ 20 స్థానానికి దిగజారిపోతుందనీ ధ్వజమెత్తారు. కేరళ, అస్సాం, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని, ఆ స్థాయికి ఏపీ చేరుకోలేదని అన్నారు.
వేలమంది ఉపాధి..
ఛత్తీస్గఢ్, జార్ఖండ్తో ఏపీ పోటీ పడుతోందని విమర్శించారు. ఏపీలో పర్యాటక శాఖపై ప్రత్యక్షంగా..పరోక్షంగా వేలాది మంది ఆధారపడ్డారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి జీవితాలు మట్టికొట్టుకు పోయాయంటూ నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రోజా నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదనీ మండిపడ్డారాయన. ఎవరూ ఈ కుప్పతొట్టిని కెలకరని, పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని నాగబాబు సూచించారు.
విషయం ఉండాలి..
దీనిపై తాజాగా మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు అందులో విషయం ఉంటే చెయ్యాలని లేదా నోరు మూసుకుని కూర్చోవాలని సూచించారు. నోటికి ఎంత వస్తే అంత వాగడం మంచిది కాదని పేర్కొన్నారు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం నాగబాబుకే చెల్లుతుందని ఎదురుదాడికి దిగారు. ఏపీ గురించి నాగబాబుకు ఉన్న జ్ఞానం.. శూన్యం అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.
వీడియో క్లిప్..
తన శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నాగబాబు అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. దీనికి ఓ వీడియో క్లిప్పింగ్ ను జత చేశారు. పర్యాటకరంగంలో ఏపీ మూడో స్థానానికి ఎగబాకిందంటూ వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను అందులో పొందుపరిచారు. గతంలో నందమూరి బాలకృష్ణ.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అలగాజనం అంటూ సంబోధించిన వీడియోను కూడా యాడ్ చేశారు.