చెప్పులు పోతే కొనుక్కోవచ్చు పవన్ .. కానీ అదే పోతే ఎలా?: మంత్రి అప్పలరాజు సెటైర్లు
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడుతూ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, సీఎంగా అవకాశం ఇస్తే దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ పదేపదే ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుక్కుంటున్నారని, సీఎంపదవి ప్రజలు ఇవ్వాలి కానీ అడుక్కుంటే రాదు అంటూ పవన్ కళ్యాణ్ పై సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ముందు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చెప్పాలని ప్రశ్నించిన ఆయన అసలు జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంత వరకు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది పవన్ కే క్లారిటీ లేదని, పవన్ కళ్యాణ్ ముందు దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రం మొత్తం తిరుగుతూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ముందు అసలు ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారో డిసైడ్ అవ్వాలని హితవుపలికారు.
పవన్ కళ్యాణ్ చేస్తుంది అసమర్థ యాత్ర అని పేర్కొన్న సీదిరి అప్పలరాజు రాష్ట్రం మొత్తం తిరిగి నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అంటే అర్థం ఉందా అని ప్రశ్నించారు. 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సీఎం అవ్వరు అని మంత్రి సీదిరి అప్పలరాజు చురకలంటించారు. చెప్పులు పోతే కొనుక్కోవచ్చు కానీ మీ పార్టీ గుర్తు పోతే ఎలా అంటూ ఎద్దేవా చేశారు.
అసలు మీ గుర్తు ఏమిటో మీకే తెలియదని, ముందు మీ గుర్తు వెతుక్కోండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ తాను ట్రైనింగ్ అయ్యానని తనను ముఖ్యమంత్రిని చేయాలని అడుగుతున్నారని, అసలు జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నదో పవన్ కే క్లారిటీ లేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 2019 లో అందరు కలిసి రాజకీయాలు చేశారని, అయినా వైసీపీ విజయం సాధించింది అన్నారు.
ఇప్పుడు రానున్న ఎన్నికలలోనూ అందరూ కలిసే పోటీ చేసినా తాము ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతామని, వైసీపీదే విజయం అని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల విమర్శలతో రాజకీయం వేడెక్కింది.












Click it and Unblock the Notifications