మీసం తిప్పుతూ సోమిరెడ్డి ఫ్లెక్సీ: హట్ టాపిక్, కారణమదేనా?
నెల్లూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీసం తిప్పుతూ ఉన్న ఫోటోతో ఏర్పాటు చేసిన కటౌట్ సంచలనంగా మారింది.
నెల్లూరు: నెల్లూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీసం తిప్పుతూ ఉన్న ఫోటోతో ఏర్పాటు చేసిన కటౌట్ సంచలనంగా మారింది.
2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే నెల్లూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలుచుకొంది.ఈ జిల్లాలో ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. రెండు ఎంపీ స్థానాలు కూడ వైసీపీ కైవసం చేసుకొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పి. నారాయణకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి మంత్రి పదవి దక్కింది.

మీసం తిప్పుతూ సోమిరెడ్డి కటౌట్
నెల్లూరులో ముత్తుకూరు సెంటర్లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీసం తిప్పుతూ ఏర్పాటు చేసిన కటౌట్ చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ముఖ్య నేతల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో ఈ కటౌట్ నేతల మధ్య సంబంధాలను చెడగొట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు. గతంలో సోమిరెడ్డితో ఆనం బ్రదర్స్కు అస్సలు పడేదికాదు.. అలాగే సోమిరెడ్డికి ఆదాల ప్రభాకర్రెడ్డికి మధ్య విభేదాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ తరుణంలో ఈ కటౌట్ వల్ల రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అసంతృప్తిలో టిడిపి కార్యకర్తలు
నెల్లూరు జిల్లాలో టిడిపి కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నారు. జిల్లా నుండి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదనే ఆవేదనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎక్కువగా సర్వేపల్లి నియోజకవర్గానికే ప్రాధాన్యమిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు.

బీద రవిచంద్ర యాదవ్ పరిస్థితి ఇలా..
టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్ మాత్రం మంత్రులను నేతలను కలుపుకుపోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు వేసి.. ఇప్పటికీ ప్రకటించలేదు.. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల గురించి పెద్దగా పట్టించుకోవడం మానేసింది పార్టీ అధిష్టానం. రేపోమాపో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా గ్రామస్థాయిలో పార్టీ పరిస్థితి గురించి ఆలోచించేవారే కరువయ్యారనే అభిప్రాయాలను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీని ఎదుర్కొనేనా
నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. అయితే టిడిపి ముఖ్య నేతల మధ్య సమన్వయం అంతంత మాత్రంగానే ఉంది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే పార్టీని బలోపేతం చేసుకోవాలి. కానీ, ఆ దిశగా టిడిపి నాయకత్వం చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications