వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లిన మంత్రి - స్వామిభక్తి చాటుకొంటూ : వైసీపీలో కొత్త పోకడ..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన మంత్రులు ఇలా పాదాభింద నాలు చేయటం.. మోకరిల్లటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి..పార్టీ సమన్వయకర్త కు మోకరిల్లి నమస్కారం చేయటం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 11వ తేదీన ఏపీ కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది.
స్వామిభక్తి చాటుకొనే క్రమంలో
ఆ సమయంలో మంత్రి పదవులు దక్కిన పలువురు.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడే వేదిక పైనే వరుసగా పోటీ పడి సీఎం జగన్ కు పాదాభివందనం చేసారు. జగన్ కంటే వయసుల పెద్ద వారు సైతం ఆయన కాళ్లకు నమస్కారం పెట్టారు. ఇక, మంత్రిగా రెండోసారి అవకాశం దక్కించుకున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఒకింత స్వామి భక్తి చాటుకొనే క్రమంలో విమర్శలకు కారణమవుతున్నారు.
ఆయన సమాచార ప్రసార శాఖ సైతం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ ను ఆరాధించాలంటూ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక, ఇప్పుడు అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కుడుపూడి చిట్టబ్బాయి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఓపెన్ మీటింగ్ లో మోకరిల్లి పాదాభివందనం
జిల్లాకు చెందిన వైసీపీ ప్రముఖులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ ప్రాంతానికి పార్టీ సమన్వకర్తగా ఉన్నారు. అందరూ వేదిక పైన ఉండగానే.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వేదికపై ఉన్న సుబ్బారెడ్డి ముందు కొన్ని క్షణాల పాటు మోకరిల్లి నమస్కారం పెట్టారు.
శెట్టిబలిజ సామాజిక వర్గీయులకు ప్రభుత్వంలో సుస్థిర స్థానం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డి కృషి ఎన్నటికీ మరువలేనిదని మంత్రి చెప్పుకొచ్చారు.
ఒక్క సారిగా వేణు అలా మోకరిల్లి.. సుబ్బారెడ్డికి నమస్కారం పెట్టటంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. మంత్రి హోదాలో ఉన్న వేణు...ఇలా చేయటం ఏంటనే చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి..సామాజిక వర్గం పేరు చెబుతూ..మోకరిల్లటం పైనే ఈ చర్చంతా సాగుతోంది.
మంత్రులుగా ఉంటూ ఇలా చేయటం పై
వ్యక్తిగతంగా సుబ్బారెడ్డి పైన గౌరవం ఉంటే.. అది ప్రదర్శించే వేదికలు ఇలా మీటింగ్ వేదికలు కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేవలం సీఎం జగన్ ... పార్టీ ముఖ్య నేతల పైన స్వామి భక్తి ప్రదర్శిచంటం ద్వారా పార్టీలో వారి వద్ద మార్కులు వస్తారో రావో కానీ, ప్రజల్లో మాత్రం అనేక రకాల చర్చలకు కారణంగా నిలుస్తున్నారు.
ఇక విధంగా మంత్రి వేణు చేసిన పనికి వైవీ సుబ్బారెడ్డి కూడా ఒకింత అసౌకర్యానికి గురయ్యారు. ఇలాంటి వ్యవహార శైలితో ప్రతిపక్ష పార్టీ నేతల చేతికి రాజకీయంగా అస్త్రాలు అందించినట్లేననే వాదన సైతం వినిపిస్తోంది. ఇక, దీనిని మంత్రి వేణు ఏ రకంగా సమర్ధించుకుంటారో..పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.