పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే: మంత్రి విడదల రజిని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వైఎస్ఆర్సిపి మంత్రులను, జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు స్పందిస్తున్నారు. తనను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని, చెప్పు చూపించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.

పవన్ కు మతి భ్రమించింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారని విడదల రజిని ఎద్దేవా చేశారు. వైసిపి నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్న మంత్రి విడదల రజిని అసలు పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న వారు రాజకీయాలకు పనికి రారని తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పడం తప్పా చేసిందేమీ లేదని విడదల రజిని మండిపడ్డారు.

రెండు చోట్ల ఓడినా పవన్ కళ్యాణ్ కు బుద్ధి రాలేదు
పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే ఉంటుందని జనసేన కార్యకర్తలకు కూడా తెలిసిపోయిందని విడదల రజిని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు రెండు నియోజకవర్గాల ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారని, భవిష్యత్తులో కూడా బుద్ధి చెబుతారని విడదల రజిని తేల్చిచెప్పారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినా పవన్ కళ్యాణ్ కి ఇంకా బుద్ధి రాలేదని మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలిసినంత మాత్రాన ఆ రెండు పార్టీలను ప్రజలు ఆదరించేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఇద్దరి ముసుగు తొలగింది
చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడని, ఇప్పటివరకు ముసుగులో ఉన్న వారిద్దరి బాగోతం తాజాగా ముసుగు తొలగడంతో బయటకు వచ్చిందని విడదల రజిని తెలిపారు. ఇక నేడు చంద్రబాబు పల్నాడు పర్యటన పైన కూడా విడదల రజనీ అసహనం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు పల్నాడు పర్యటన చేస్తారు అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు, కరువు రెండూ కవలపిల్లలు
అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలన ఏ ముఖం పెట్టుకుని చేస్తున్నారంటూ విడదల రజిని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి విడదల రజిని చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లలని మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications