హైదరాబాద్లో కరెంట్ లేక జనరేటర్ వేసుకున్నా; కేటీఆర్ కాకమ్మకథలంటూ మంత్రులు బొత్సా, జోగిరమేష్ ఫైర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు లేదని, నీరు లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎదురు దాడి మొదలుపెట్టారు.తాజాగా మంత్రులు బొత్సా సత్యన్నారాయణ, జోగి రమేష్ లు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.

తాను హైదరాబాద్ నుండే వస్తున్నా.. కరెంట్ లేక జనరేటర్ వేసుకున్నా: బొత్సా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాను హైదరాబాద్లో ఉండి వస్తున్నానని, అక్కడ కరెంటు లేదని జనరేటర్ పెట్టుకొని ఉండాల్సి వచ్చిందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కావాలంటే వాళ్ళ ఘనత చెప్పుకోవచ్చు కాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. కేటీఆర్ కు ఆయన స్నేహితుడు పక్క రాష్ట్రంలో పరిస్థితులు గురించి చెప్పాడని పేర్కొన్నారని, కానీ తాను హైదరాబాద్లోనే ఉండి వస్తున్నాను అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా అని పేర్కొన్న బొత్స సత్యనారాయణ బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించిన ఆయన, తన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ విత్ డ్రా చేసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు.

ఏపీ అభివృద్ధి ఓర్చుకోలేక వ్యాఖ్యలు: జోగి రమేష్
హైదరాబాద్లోని క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పక్క రాష్ట్రం అంటూ సంబోధిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ రివర్స్ ఎటాక్ చేశారు. కేటీఆర్ ఏపీని ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కేటీఆర్ వ్యాఖ్యలపై ఎదురు దాడి చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది కోస్తా ఆంధ్రా ప్రజల వల్లే అని, తెలంగాణాకు కల్చర్ నేర్పింది ఏపీ ప్రజలని పేర్కొని కేటీఆర్ కు చురకలు అంటించారు. ఇక మంత్రి జోగి రమేష్ సైతం కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్న మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

విజయవాడకు వస్తే అభివృద్ధి ఏంటో కనిపిస్తుంది
ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ కు మంత్రి జోగి రమేష్ సూచించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ విజయవాడకు ఒకసారి వచ్చి చూస్తే అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని పేర్కొన్న మంత్రి జోగి రమేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని చూడటం కోసం అందరినీ ఆహ్వానిస్తున్నాము అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అమ్మఒడి కనిపిస్తుందని, ఆసరా కనిపిస్తుందని, డిజిటల్ లైబ్రరీ లో కనిపిస్తాయని పేర్కొన్న మంత్రి జోగి రమేష్ 30 లక్షల మందికి ఇళ్ళు కట్టించే పట్టణాల నిర్మాణం కూడా కనిపిస్తుంది అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

కెసిఆర్ తరహాలోనే మంత్రి కేటీఆర్ కాకమ్మ కథలు, పిట్ట కథలు
ప్రతి గ్రామంలోనూ సచివాలయం నిర్మించిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే అని మంత్రి జోగి రమేష్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సచివాలయాల వ్యవస్థ గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు గుప్పించారు అని జోగి రమేష్ గుర్తుచేశారు. ఒక్క స్టాలిన్ మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ పాలనను మెచ్చుకున్నారని పేర్కొన్న జోగి రమేష్ జగన్ పరిపాలన చూసిన అక్కసుతో ఓర్చుకోలేక ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ తరహాలోనే మంత్రి కేటీఆర్ కాకమ్మ కథలు, పిట్ట కథలు చెబుతున్నారు అంటూ మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications