టి: రాజీనామాలపై భిన్నస్వరాలు, భేటీకి వారు డుమ్మా
న్యూఢిల్లీ: కేబినెట్ హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడంతో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు పలువురు రాజీనామా వైపు మొగ్గు చూపుతుండగా, ఇంకొందరు వారితో విభేదిస్తున్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాలులో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర పర్యటనలో ఉన్నందున జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు గైర్హాజరయ్యారు.
గురువారం రాత్రి కేబినెట్ నిర్ణయం అనంతరమే రాజీనామాలను రాష్ట్రపతికి సమర్పించాలని చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి వంటి నేతలు భావించారు. అయితే వారిని కొందరు వారించినట్లుగా తెలుస్తోంది. అందరం సమైవేశమై ఒకే నిర్ణయం తీసుకుందామని మరికొందరు సూచించారు. రాజీనామాను సభలోనే స్పీకర్కు ఇవ్వాలని ఇంకొందరు భావించారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి నేతలు రాజీనామాల కోసం పట్టుబడుతుండగా, ఇంకొందరు పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించాక మూకుమ్మడి రాజీనామా చేద్దామని చెబుతున్నారు. ఇంకొందరు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉందామని అయితే, రాజధాని, ప్యాకేజీల, హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంపై పట్టుబట్టాలని చెబుతున్నారు.
ఇప్పటికే మనం కేంద్రానికి విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు సమర్పించామని, మరోసారి ఇచ్చి లాభం లేదని కేంద్రమంత్రులు పలువురు అభిప్రాయపడుతున్నారు. కేబినెట్ భేటీ జరుగుతుండగానే నలుగురు కేంద్రమంత్రులు, కొందరు ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు సెంట్రల్ హాలులో భేటీ అయిన నేతలు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. భేటీకి జెడి శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు దూరంగా ఉన్నారు.