అల్టిమేటమ్: దాసరి, చిరులపై మంత్రుల ఎదురుదాడి
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చిన కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవి, తదితర కాపు ప్రముఖులపై రాష్ట్ర మంత్రులు ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్ పార్క్ హయత్లో సమావేశమైన నేతల్లో చాలా మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పని చేసినవారేనని, అధికారం అనుభవించినప్పుడు కాపులు వారికి గుర్తు లేరని వారన్నారు.
దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, పల్లంరాజు, సి.రామచంద్రయ్య కాపులను అడ్డుపెట్టుకొని పదవుల్లోకి వచ్చినవారేనని, పవర్లోకి వచ్చిన మాత్రం కాపులను మర్చిపోయారని అన్నారు. చిరంజీవి సొంత పార్టీ పెట్టి కాపుల ఓట్లతో సీట్లు గెలిచారని, గెలిచిన తర్వాత ఎప్పుడైనా ఆయన కాపు అనే పదం ఉపయోగించారా? అని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పి.నారాయణ మండిపడ్డారు.
ముద్రగడ దీక్షపై చర్చించడానికంటూ హైదరాబాద్లో సమావేశమైన నేతలు ఆయన ఆరోగ్యం గురించి ఏమాత్రం యోచించలేదని, ఆరోగ్య రీత్యా దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేయలేదని మంత్రులు అభ్యంతరపెట్టారు. ఆ నేతలకు కావలసింది ముద్రగడ ఆరోగ్యం కాదని, రాజకీయం చేయడమేనని అన్నారు.
ముద్రగడ దీక్ష ఐదో రోజుకు చేరిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొందరు మంత్రులు, ముఖ్య నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత హోంమంత్రి అయిన చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, డీజీపీ జేవీ రాముడు, ఇంటలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావులతో విడిగా సమావేశమయ్యారు.
ఆ తర్వాత చినరాజప్ప, నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముద్రగడ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇచ్చారు. ముద్రగడ భార్య, కోడళ్లకు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఇచ్చారని, అయితే, ముద్రగడ, ఆయన కుమారుడు మాత్రం తీసుకోవడంలేదని చినరాజప్ప చెప్పారు. పరిస్థితి చేయిదాటదని, ముద్రగడ ఆరోగ్యాన్నీ, శాంతిభద్రతలను కాపాడతామని చెప్పారు.
డాక్టర్లు ఒక నివేదికను కలెక్టర్కు ఇచ్చారని,, ఐదో రోజు కాబట్టి కచ్చితంగా ఫ్లూయిడ్స్ ఇవ్వాలని, కచ్చితంగా ఇస్తామని స్పష్టం చేశారు. ముద్రగడ పురుగు మందు సీసాను పక్కన పెట్టుకున్నందున.. ఆయన ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే తలుపులు బద్దలుకొట్టి బయటకు తీసుకురావలసి వచ్చిందని చెప్పారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంవల్లనే ఇప్పుడు కాపు కమిషన్, కార్పొరేషన్ రెండూ పని చేస్తున్నాయని, త్వరలో పల్స్ సర్వే చేపడుతున్నారని అన్నారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో కలిపి ఇప్పుడు కాపుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స పట్టించుకోలేదని, నిన్నటిదాకా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన నేతలు హైదరాబాద్ సమావేశంలో ఈ విషయాన్ని ఎందుకు వదిలేశారని అన్నారు.
ముద్రగడ కేసులను ఎత్తిఏయాలని కోరుతున్నారని, కానీ అవి ప్రభుత్వం చేతుల్లో లేవని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 144 సెక్షన్ ఉందని, తాము గట్టిగా ఉంటే తుని సంఘటన జరిగేది కాదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు నేతలు యువకులను రెచ్చగొడుతున్నారని, ఉద్యమం ముసుగులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.