Raghurama Krishnam Raju అరెస్టుపై భిన్నస్పందన- టైమింగ్పై చర్చ- బెయిల్ రద్దు కోరినందుకేనా ?
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుపై భిన్నస్పందన వ్యక్తమవుతోంది. సీఎం జగన్నూ, ప్రభుత్వాన్ని పదే పదే దూషించారన్నకారణంతో రెండేళ్ల తర్వాత ఆయన్ను అరెస్టు చేయడం వెనుక కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంత ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇన్నాళ్లూ రఘురామ విమర్శల్ని చూసీచూడట్లుగా వదిలేసిన వైసీపీ సర్కార్.. ఇంత సడెన్గా ఆయన్ను అరెస్టు చేయడం వెనుక ఓ ప్రధాన కారణం ఉన్నట్లు అర్దమవుతోంది.
రఘురామ అరెస్టుకు దారితీసిన పరిస్ధితులు
సరిగ్గా రెండేళ్ల క్రితం వైసీపీ తరఫున నరసాపురం ఎంపీ సీటు నుంచి గెలిచిన కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆరునెలలు గడిచాయో లేదో వైసీపీకి దూరమై బీజేపీకి దగ్గర కావడం మొదలుపెట్టారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీలకు విందు ఇవ్వడం ద్వారా ఆయన ప్రాదాన్యాలేంటో రఘురామ చెప్పకనే చెప్పేశారు. అంతవరకూ బాగానే ఉన్నా వైసీపీ ప్రభుత్వంపై ఆయన మొదలుపెట్టిన విమర్శల్ని ఆ పార్టీ మొదట్లో పట్టించుకోలేదు. క్రమశిక్షణ కమిటీ పేరుతో కొన్నిరోజులు హంగామా చేసి ఆ తర్వాత సభ్యత్వ రద్దు కోరుతూ లోక్సభ స్పీకర్ను ఆశ్రయించినా వైసీపీ కోరుకున్నట్లు ఏదీ జరగలేదు. దీంతో రఘురామ దూకుడు మరింత ఎక్కువైంది. దీంతో ఆయన్ను సొంత నియోజకవర్గంలో ఒంటరిని చేసేందుకు వైసీపీ సర్కారు వరుస కేసులు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి పరిమితమయ్యారు. చివరికి ఆఖరి అస్త్రంగా జగన్ బెయిల్ రద్దు కోసం ఆయన ఏకంగా సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇదే ఆయన కొంపముంచింది.
రఘురామ అరెస్టుపై ఇంటా బయటా
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సొంత పార్టీ ప్రభుత్వం ఏదో ఒక రోజు అరెస్టు చేస్తుందని అందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఇప్పుడేనా అంటే మాత్రం ఎవరి వద్దా కచ్చితమైన సమాధానం లేదు. దీంతో రఘురామ అరెస్టు ఇటు రాష్ట్రంతో పాటు అటు జాతీయ స్ధాయిలోనూ చర్చనీయాంశమవుతోంది. సొంత పార్టీ ఎంపీని అరెస్టు చేయాల్సిన అగత్యం వైసీపీకి ఎందుకొచ్చిందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. దీంతో ప్రభుత్వం ఆ మేరకు ఇరుకునపడుతోంది. రఘురామకృష్ణంరాజును భయపెట్టేందుకు ప్రభుత్వం వద్ద అరెస్టును మించిన అస్త్రాలు లేవా అన్న చర్చ కూడా జరుగుతోంది.
జగన్ బెయిల్ రద్దు కోరినందుకేనా అరెస్టు ?
ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిత్యం రచ్చబండ పేరుతో ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయాలన్న ఆలోచన మాత్రం వైసీపీకి రాలేదు. కానీ ఎప్పుడైతే ఏకంగా జగన్ను నేరుగా ఇరుకునపెట్టే్లా ఆయన బెయిల్ రద్దు కోరుతూ రఘురామ హైదరాబాద్ సీబీఐ కోర్టును ఆశ్రయించారో అప్పటి నుంచి వైసీపీలో కలకలం మొదలైంది. ముఖ్యంగా రఘురామ పిటిషన్ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడం, నోటీసులు జారీ చేయడం, వాటికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిన పరిస్దితి రావడం ప్రభుత్వానికి మింగుడుపడలేదు. దీంతో రఘురామను భయపెట్టేందుకే అరెస్టుకు ప్రభుత్వం పావులు కదిపినట్లు తెలుస్తోంది.
Recommended Video
రఘురామకు బెయిల్ లభిస్తే ?
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ నోటీసులిచ్చి, ప్రశ్నించి వదిలి పెట్టడం వేరు. అరెస్టు దాకా వెళ్లడం వేరు. ఓ ఎంపీ స్ధాయిలో ఉన్న వ్యక్తిని, అదీ ప్రభుత్వంపై, సీఎంపై విమర్శలు చేశారన్న కారణంతో అరెస్టు దాకా వెళ్లడాన్ని హైకోర్టు ఇప్పుడు ఎలాతీసుకుంటుందన్న చర్చ సాగుతోంది. ఇవాళ రఘురామ లాయర్లు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే జగన్పై తాను బహిరంగంగానే పోరాటం చేస్తున్నానని, ఆయన బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా పెండింగ్లో ఉందని రఘురామ హైకోర్టుకు చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ వాదనను హైకోర్టు అంగీకరిస్తే ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. అలా కాదని ఎంపీ స్దాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్లు నిర్ధారిస్తే తదుపరి చర్యలకు ఆయన సిద్ధపడాల్సి ఉంటుంది. హైకోర్టులో రఘురామ వాదన నెగ్గితే మాత్రం ఆయనకు బెయిల్ లబించవచ్చు.