జగన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర: ఎమ్మెల్యే, మంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం
విజయనగరం/ ఒంగోలు: రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోందని విజయనగరం జిల్లా సాలూరు శాసనసభ్యుడు రాజన్నదొర ఆరోపించారు. ఆయన సోమవారం విజయనగరం జిల్లా సాలూరులో మాట్లాడారు.
ప్రజా ప్రయోజనాలను ఆశించి దీక్షకు దిగిన జగన్మోహన్ రెడ్డిని మంత్రులు కామినేని శ్రీనివాస రావు, ప్రతిపాటి పుల్లారావు హేళన చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు.
వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలను వారు లాక్కున్నారు. దీంతో పోలీసులపై రాజన్నదొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా మాట్లాడిన మంత్రునలు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావుల దిష్టిబొమ్మలను సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ప్రకాశం జిల్లా చీరాలలో దహనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ గత ఆరు రోజులుగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేస్తుండగా, ఆయన దీక్షపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారి దిష్టిబొమ్మలను చీరాల గడియారం స్తంభం సెంటర్లో దహనం చేశారు.