నిజమెంత?: క్రికెట్ బెట్టింగ్ కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యేలు?
నెల్లూరు: క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారిచ్చిన సమాచారం ప్రకారం కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములైనట్లు తెలిసింది.
30మంది బుకీలు, పంటర్లను అరెస్ట్ చేసి, వారిని పోలీసులు విచారిస్తుండగా పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. బెట్టింగ్ వెనుక పలువురు ఎమ్మెల్యేలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారని అరెస్టైన నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
అయితే, అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నప్పటికీ తమ పార్టీ ప్రజాప్రతినిధులను మాత్రమే ఇరికించే కుట్ర చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బుకీల నుంచి పోలీసులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని ఆరోపించారు.
కానిస్టేబుల్ నుంచి సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులకూ ఇందులో భాగముందని వారు ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నేతలను వదిలేసే ప్రయత్నం జరుగుతోందని వారు మండిపడ్డారు. కాగా, పోలీసుల విచారణలో బయటకు వెల్లడైన పేర్ల గురించి స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.