తునిలో 10వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్న యనమల రామకృష్ణుడుకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సవాల్
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా యనమలకు సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లోతుని నియోజకవర్గం నుండి యనమల రామకృష్ణుడు కుటుంబం నుండి, లేదా టిడిపి నుండి ప్రత్యర్థి ఎవరైనా సరే 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తీరుతాను అంటూ సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో 15 విట్ల కంటే తక్కువ మెజార్టీ వస్తే ఆ పని చేస్తా : తుని ఎమ్మెల్యే
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా 15 వేల ఓట్ల కంటే తక్కువ ఓట్ల మెజార్టీ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా టిడిపి గౌరవ సభలో యనమల రామకృష్ణుడు చేసిన కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని, జగన్ వన్ టైం సీఎంగా మిగలబోతున్నారు అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.

యనమల వ్యాఖ్యలకు దాడిశెట్టి రాజా కౌంటర్
యనమల వ్యాఖ్యలపై మండిపడిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మళ్ళీ తుని నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అని తేల్చి చెప్పారు. తాను ఖచ్చితంగా గెలిచి తీరుతాను అని సవాల్ విసిరారు. తన గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. టిడిపి నేతలు తనపై గెలుపు సంగతి అలా ఉంచి, తనకు 15 వేల ఓట్ల మెజారిటీ రాకుండా చూసుకోవాలి అంటూ దాడిశెట్టి రాజా చాలెంజ్ చేయడం ఇప్పుడు నియోజకవర్గం లో సంచలనంగా మారింది.

టీడీపీ గౌరవ సభలో యనమల వ్యాఖ్యలు ..2024లో విజయం మనదే
ఇదిలా ఉంటే తూర్పు గోదావరిజిల్లా తుని నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ గౌరవ సభ సోమవారం నాడు నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, జ్యోతుల నవీన్ మరియు జిల్లా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టిడిపి గౌరవ సభలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలుచేశారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పోలీసుల అండతో ప్రతిపక్షాలపై కేసులు పెట్టినా సరే 2024లో జరగనున్న ఎన్నికల్లో మనమే విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ శ్రేణులకు యనమల పిలుపు
ఒక్కచాన్స్ అంటూ అధికారం లోకి వచ్చిన జగన్ తన అరాచక పాలనతో ఆస్తులు సంపాదించడం తప్ప చేసిందేమీ లేదన్నారు యనమల . జగన్ రాష్ట్ర ప్రజలను నిరుపేదలను చేస్తున్నాడని మండిపడ్డారు. అడుగడుగునా అరాచకం, అడుగడుగునా దోపిడీ జరుగుతుందని ధ్వజమెత్తారు. జగన్లో అతని తాత రాజారెడ్డి జీన్స్ ఎక్కువగా ఉన్నాయని, తాత మాదిరిగానే ప్రత్యర్థులను దుర్మార్గంగా అణిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో ప్రజలు తిరగబడి ధర్మాన్ని గెలిపించే రోజు వస్తుందని యనమల రామకృష్ణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసం టీడీపీ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు.

యనమలకు సవాల్ చేసి మెజార్టీ రాకుండా చూడాలన్న తుని ఎమ్మెల్యే
ఇదే సమయంలో తుని నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని, 10 వేల మెజారిటీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల పైన తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా యనమల రామకృష్ణుడుపై మాటల దాడి చేశారు. సంచలన సవాల్ విసిరారు. తనను గెలవాలన్న ఆలోచన పక్కనపెట్టి తనకు మెజార్టీ రాకుండా ఆపాలని చాలెంజ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications