రెండున్నరేళ్లలో బాధపడలేదు, ఇక నేనేంటో చూపిస్తా: తొలిసారి మేకపాటి ఫైర్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డికి సోమవారం నాడు కోపం వచ్చిందట.
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డికి సోమవారం నాడు కోపం వచ్చిందట. తన మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దని, మీరు పద్ధతిగా ఉండాలని, నేను పద్ధతిగా ఉంటానని, పద్ధతి మార్చుకోకుంటే నేనోంటో చూపిస్తానని అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, తనను అవమానిస్తే ప్రజలను అవమానించినట్లేనని, రెండున్నరేళ్లుగా తాను ఎప్పుడూ బాధపడలేదని, ఇటీవల ఆత్మకూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు.
మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్ పాటించి తీరాలన్నారు. తన మంచితనాన్ని చేతగానితనంగా భావించవద్దని హితవు పలికారు. లేదంటే తానేమిటో చూపిస్తానని హెచ్చరించారు. ఆత్మకూరు పట్టణంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మున్సిపల్ అధికారులపై ఆయన పైవిధంగా మండిపడ్డారు.

గౌతమ్ రెడ్డి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా అడుగు పెట్టారు. పోటీ చేసిన మొదటిసారే ఘన విజయం సాధించారు. ఈ రెండున్నరేళ్లలో ఆయన ఎవరి పైన కోపగించుకున్న సందర్భాలు లేవని అంటున్నారు.
అంతేకాదు, ఆయన అధికారులను హెచ్చరించడం, ఇతర పార్టీలను విమర్శించడం చేయలేదు. ఇప్పుడు తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు.
ఆత్మకూరులో రూ.15 లక్షలతో నిర్మాణం చేపట్టిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవానికి అధికారులు గౌతమ్ రెడ్డిని ఆహ్వానించలేదు. వైసీపీకి చెందిన కౌన్సిలర్లకు సైతం సమాచారం లేదంటున్నారు. దీంతో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గౌతమ్ రెడ్డి కారణంగా వారు కూడా కినుక వహించారంటున్నారు. అయితే, మెతక వైఖరి సరికాదని భావించిన గౌతమ్ రెడ్డి ఇప్పుడు ఆగ్రహించారట.












Click it and Unblock the Notifications