వైసిపి నేతకు రూ.3 కోట్ల పనుల చిక్కు: కడప టిడిపిలో లుకలుకలు
కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు సవాళ్ల వరకు వెళ్తున్నాయి. వైసిపి నేత బంధువుకు ఎమ్మెల్యే జయరాములు రూ.3 కోట్లు పనులు ఇచ్చారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపించాయి.
కడప: కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు సవాళ్ల వరకు వెళ్తున్నాయి. వైసిపి నేత, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బంధువుకు ఎమ్మెల్యే జయరాములు రూ.3 కోట్లు పనులు ఇచ్చారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపించాయి.
దీనిపై జయరాములు స్పందించారు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బంధువుకు తాను పనులు ఇచ్చానని నిరూపిస్తే టిడిపికి రాజీనామా చేస్తానని, రుజువు చేయకుంటే తనప ఆరోపణలు చేసిన వారు రాజకీయాలను వదులు కుంటారా అని సవాల్ విసిరారు.
చదవండి: వైసిపిలోకి టిడిపి నేత: కడప పర్యటనను వాయదా వేసుకున్న జగన్
మాజీ ఎమ్మెల్యే విజయమ్మతోపాటు ఏడు మండలాలకు చెందిన టిడిపి నాయకుల తీరును ఆయన తప్పుపట్టారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాలే తప్ప తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చవద్దన్నారు.

నియోజకవర్గానికి ఓ పథకం కింద రూ. 70 కోట్లు పనులు వచ్చాయని, తన వర్గీయులకు ఒకపని కూడా ఇవ్వకుండా తనకు నచ్చిన వాళ్లకు విజయమ్మ కేటాయించారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ నవ నిర్మాణ, మహా సంకల్ప దీక్షల్లో పాల్గొనకుండా.. తనపై టిడిపి నాయకులను రెచ్చగొట్టి పత్రిలకెక్కడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారంతా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నవారేనన్నారు.
కాగా, జయరాములు కూడా 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసిపి నుంచి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టిడిపిలోకి వచ్చిన చోట ఆ పార్టీలో లుకలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications