కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి తన రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ గా ఎంపీ ఆదాల నియమితులయ్యారు. ప్రభుత్వం పైన వరుస విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇదే సమయంలో కార్పోరేటర్ కిడ్నాప్ కు ప్రయత్నించారనే ఫిర్యాదుతో కోటంరెడ్డి పై కేసు నమోదు అయింది. అటు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కోటంరెడ్డి ఫైర్ అవుతున్నారు. మంత్రి కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం కోటంరెడ్డి గన్ మెన్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతి స్పందనగా కోటంరెడ్డి తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ మరో నిర్ణయం ప్రకటించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకొచ్చారు. ప్రభుత్వం తాజాగా శ్రీధర్ రెడ్డి భద్రతను తగ్గిస్తూ 2+2 ఉన్న ఉన్న గన్మెన్లను 1+1 గా మార్చింది. కోటంరెడ్డి దీని పైన స్పందించారు. తన వద్ద ఉన్న ఇద్దరు గన్ మెన్లను మీడియా ముందుకు పిలిచారు. ఆ ఇద్దరినీ కూడా తనకు వద్దంటూ ప్రభుత్వానికి సరెండర్ చేస్తన్నట్లు వెల్లడించారు. తనకు ఉన్న ఇద్దరు గన్మెన్లను వెనక్కు పంపి ఎదురు గిఫ్ట్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గన్మెన్లను తొలగించినంత మాత్రాన భయపడేది లేదన్నారు. నాకు కార్యకర్తలే రక్షణగా ఉంటారన్నారు. తనకు బెదిరింపులు వస్తన్న వేళ భద్రతను తగ్గించినా..తాను ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేసారు. తగ్గేదే లే అంటూ..కోటంరెడ్డి తేల్చి చెప్పారు. పోలీసు అధికారుల పైన ఆరోపణలు చేసారు. ఏం జరిగినా తన గొంతు తగ్గేది లేదని కోటంరెడ్డి స్పష్టం చేసారు.
రఘురామ రాజు అంశాన్ని ప్రస్తావించారు. ఆయన కంటే పదింతల వేధింపులు తప్పవని తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. కోటం రెడ్డి మధ్య మాటల యుద్దం సాగుతోంది. రేపు జిల్లాకు మంత్రి కాకాని వస్తున్నారు. అదే సమయంలో కొత్తగా ఇంఛార్జ్ గా నియమితులైన ఆదాల కూడా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో కోటంరెడ్డితో కలిసి వెళ్లే నేతలు ఎవరనే అంశం పైన చర్చ జరుగుతోంది. పార్టీని వీడి కోటంరెడ్డితో ఎవరూ వెళ్లరని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇప్పటికప్పుడు తనతో ఎవరూ లేకపోయినా.. రానున్న రోజుల్లో తనకు మద్దతుగా నిలిచే వారు ఉంటారని కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయానికి ఎవరు ఏ పార్టీ నుంచి..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చూడాల్సి ఉంటుందంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.