రోజా పదవి అవుట్...కారణం అదేనా : మంత్రి అవుతారా.. ఇక ఎమ్మెల్యేగానేనా : ఏ హామీ లభించింది..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా విషయంలో వైసీపీలో ఏం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన ఏంటి. వైసీపీలో జగన్ హార్డ్ కోర్ సపోర్టర్..బలమైన వాయిస్ ఉన్న రోజాకు ఇప్పుడు ఉన్న పదవి కూడా పోయింది. 2019 లో రోజా రెండో సారి ఎమ్మెల్యేగా గెలవటం..వైసీపీ అధికారంలోకి రావటంతో ఖాయంగా మంత్రి అవుతారని అందరూ అంచనా వేసారు. కానీ, సామాజిక సమీకరణాల పేరుతో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో..రోజా ఒకింత ఆవేదనకు గురయ్యారు.
నామినేటెడ్ పదవి సైతం ...
ముఖ్యమంత్రి జగన్ ఓదార్చి...నామినేటెడ్ పదవి కేటాయించారు. ఏపీఐఐసీ ఛైర్మన్ హోదా ఇచ్చారు. రెండో విడత కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా రోజాకు అవకాశం వస్తుందని ఆమె అభిమానులు ఆశతో ఉన్నారు. అయితే, ఇప్పుడు ఉన్న పదవి కూడా పోవటంతో వారంతా నిరాశకు గురయ్యారు. పార్టీ కోసం పదేళ్ల కాలంగా పని చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు.. ఎమ్మెల్యేల కు జోడు పదవులు ఉండకూడదని జగన్ పాలసీ నిర్ణయంగా తీసుకున్నారు. అందులో భాగంగా రోజాతో పాటుగా మల్లాది విష్ణు..జక్కంపూడి రాజా పదవులు కోల్పోయారు. అయితే, రోజా సైతం జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుండి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవి తొలిగించి..మెట్టు గోవర్ధన్రెడ్డి కి కేటాయించారు.
మంత్రిగా అవకాశం దక్కుతుందా..
అయితే, రోజా విషయంలో సీఎం జగన్ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారనే నమ్మకం ఆమె వర్గీయుల్లో కనిపిస్తోంది. ఇప్పటికీ వచ్చే మంత్రివర్గ విస్తరణలో బెర్తు ఖాయమనే నమ్మకం వారిలో ఉంది. అయితే, జిల్లా సమీకరణాల్లో భాగంగా రెడ్డి వర్గానికి చెందిన పెద్దిరెడ్డిని పక్కన పెట్టి రోజా కు అవకాశం ఇస్తారా అంటే కష్టమే అనే సమాధానం వస్తోంది. కొందరు అది సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. అయితే, నామినేటెడ్ పదవి తొలిగించే ముందు జగన్ సన్నిహిత నేత రోజాతో మాట్లాడినట్లుగా సమాచారం. పార్టీ పాలసీ నిర్ణయంగా ఎమ్మెల్యేలకు జోడు పదవులు తొలిగిస్తున్నామని...అవకాశాలకు అనుగుణంగా భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
తొలి నుండి ఇబ్బందులే..
అయితే, జిల్లాలో..నగరి నియోజకవర్గంలోనూ సొంత పార్టీలోని ఒక వర్గం నేతలతో రోజా ఇబ్బందులు పడుతున్నారు. వారిని కంట్రోల్ చేయటంలోపార్టీ అధినాయకత్వం...జిల్లోని ఒక ప్రముఖ నాయకుడి జోక్యం కారణంగా వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక, తన నియోజకవర్గంలో ఇతర మంత్రుల జోక్యం..కనీసం జిల్లా అధికారులు సైతం తనకు గుర్తింపు ఇవ్వకపోవటం పైన రోజా కన్నీరు పెట్టుకున్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందు తన ఆవేదన వెల్లగక్కారు. అయితే, రోజా నామినేటెడ్ పదవిలో ఉన్నా..పార్టీ అధికారంలో ఉన్నా గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది.
దూకుడు తగ్గటమే కారణమా..
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉన్న దూకుడు తగ్గటమే..ఇప్పుడు ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గటానికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకంటే పూర్తిగా టీవీ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ ఉంది. దీంతో.. రోజా సైతం పార్టీ కోసం గతంలో మాదిరిగా పని చేస్తే...భవిష్యత్ లో ఖచ్చితంగా మరలా మంచి పదవులు అందుకుంటారని పార్టీలో చర్చ సాగుతోంది. మరి..ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పుడు ఈ నిర్ణయం పైన ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.