చంద్రబాబు రాజీనామా చేసి నిరూపించుకోవాలి : జగన్ దెబ్బతో కుప్పం బాట : రోజా సెటైర్లు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు పైన వైసీపీ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే రోజా సీరియస్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఇక, తాజాగా కుప్పం పర్యటనలో భాగంగా ఎన్నికల పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కుప్పం వేదికగా సీఎం జగన్ కంటే మంత్రి పెద్దిరెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేసారు. కుప్పంలో ఈ సారి చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని.. గెలవనీయమని పెద్దిరెడ్డి సవాల్ చేస్తుంటే... పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడిస్తామంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేసారు.

జగన్ దెబ్బకు కుప్పం బాట
ఇక, ఇదే అంశం పైన ఎమ్మెల్యే రోజా స్పందించారు. జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పెట్టారన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలైనా... ఏ ఎన్నికలైనా ప్రజలు జగన్ వైపే ఉన్నారన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంలా ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు తిరుగుతున్నారంటూ.. టీడీపీ చీఫ్ కుప్పం పర్యటనపై సెటైర్లు వేసిన రోజా.. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కుప్పం ప్రజలు సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

చంద్రబాబు టార్గెట్ పెద్దిరెడ్డి
రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూడాలంటే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని సవాల్ చేసారు.
అప్పుడు ప్రజా మద్దతు ఎవరికి ఉందో చూపిస్తామని రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచి.. జిల్లా నుంచి గెలిచిన ఏకైన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఈ నెలలోనే పుంగనూరు అభ్యర్ధి ఖరారు
అయితే, పుంగనూరులో టీడీపీకి అభ్యర్ధి కూడా లేరంటూ మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేసారు. ఈ సారి కుప్పం నుంచి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉంటారంటూ ప్రచారం సాగుతోంది. ఇక, చంద్రబాబు సైతం పుంగనూరు కోసం పెద్దిరెడ్డికి ధీటైన అభ్యర్ది కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పలువురి పేర్లు పరిశీలన చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరులోగానే పుంగనూరు అభ్యర్ధిత్వం పైన నిర్ణయం తీసుకోవాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications