పరిటాల కుటుంబం 2వందల కోట్ల భూకుంభకోణం; వాళ్ళను చెప్పుతో కొట్టండి: ఎమ్మెల్యే తోపుదుర్తి సంచలనం
అనంతపురం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ప్రస్తుతం పరిటాల సునీత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాటలతో వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. తాజాగా పరిటాల కుటుంబం పై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిటాల సునీతపై భూ ఆక్రమణల ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి
పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో వందల కోట్ల భూ ఆక్రమణలు చేశారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు అందుకోసం రెవెన్యూ అధికారులు కూడా ఆమెకు సహకరించారు అంటూ ఆరోపణలు గుప్పించారు. కొన్ని ఫోర్జరీ సంతకాలు కూడా చేశారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్స్ ఆర్మీ, వంక పోరంబోకు, అసైన్డ్ ల్యాండ్ భూములను చట్టబద్ధత చేసి కాజేశారని పేర్కొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీటిపై ఇటీవల ఆధారాలను కూడా తాను సేకరించానని, అందుకే బయట పెడుతున్నా అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ హయాంలో 2 వందల కోట్ల భూముల స్కామ్
టీడీపీ హయాంలో రెండు వందల కోట్ల రూపాయల భూముల స్కామ్ జరిగిందని ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు. కురుగుంట, రాచానపల్లి, కొడిమి, ప్రసన్నాయన పల్లి ప్రాంతాలలో భూములను కాజేశారని తోపుదుర్తి ఆరోపించారు. తాము బయటకు వచ్చే దానికి ఏదో ఒక విధంగా వాటిని సెట్ చేస్తారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు ఎవరు వెళ్ళినా సరే స్టేలు వచ్చేస్తున్నాయి అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
ఎవరైనా నా పేరు చెబితే చెప్పుతో కొట్టండి అన్న ఎమ్మెల్యే తోపుదుర్తి
ఇక ఇదే సమయంలో ప్రజా ప్రయోజనాలను అసలు చూడడం లేదని పేర్కొన్న ఆయన కోర్టులను అలా మార్చేశారంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ కొందరు నా పేరు వాడుకుంటున్నారు అని చెప్పిన ఎమ్మెల్యే తోపుదుర్తి ఎవరైనా నా పేరు చెబితే చెప్పుతో కొట్టండి అంటూ పేర్కొన్నారు.
ఆ తర్వాత తనకు కాల్ చేయాలని సూచించారు. ఎవరినీ వదిలిపెట్టొద్దు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత అనుచరులు కూడా తన పేరు వాడుకుని స్థాయికి దిగజారారని మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని, త్వరలో సీఎంకు ఫిర్యాదు చేస్తున్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
త్వరలో ప్రభుత్వ భూములు, దళితుల భూముల ఆక్రమణలపై మాట్లాడతా
ఇక ఇదే సమయంలో ప్రభుత్వ భూములు, దళితులకు ఇచ్చిన భూముల ఆక్రమణల గురించి త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల కాలంలో పరిటాల సునీత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పర్వం కొనసాగుతోంది .ఒకరిపై ఒకరు అక్రమ ఆస్తుల గురించి విమర్శలు చేసుకుంటున్నారు.
సవాళ్లు ప్రతిసవాళ్లతో రాప్తాడు నియోజకవర్గంలో రచ్చ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో, బెంగళూరులో ఉన్న ఆస్తులపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక తాజాగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత భూ ఆక్రమణలకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆమెపై దాడి మొదలుపెట్టారు.