సభా పర్వం : మహిళల భద్రత కోసం ఏం చేశారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ విడదల రజనీ ఫైర్
ఏపీ అసెంబ్లీ లో మహిళల భద్రత గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఏపీ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేలు మహిళల భద్రత గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ అత్యాచారం మరియు హత్య ఘటనను ప్రస్తావిస్తూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అందరినీ ఆలోచింపజేసేలా వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ..అత్యాచారం చేస్తే మరణ శిక్ష .. కొత్త చట్టం యోచన
అత్యాచారాలు ఆగాలంటే సమాజం మైండ్ సెట్ మారాలన్న ఎమ్మెల్యే
మహిళల విషయంలో సమాజం మైండ్ సెట్ మారాలని, ఆ విధంగా మార్పు తీసుకురావడానికి రాజకీయ నాయకులు కూడా తమ వంతు కృషి చేయాలని రజనీ పేర్కొన్నారు. దిశ అత్యాచారం, హత్య చేసిన నిందితుల బైక్ పై పుర్రె బొమ్మ ఉందని, డేంజర్ అని రాసి ఉందని ఆమె ఫోటో చూపించి మరీ నేరస్తుల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకున్నప్పటికీ వాటి ద్వారా నేర్చుకున్న విలువలను నిజజీవితంలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు విడదల రజిని.
మద్యం కూడా అత్యాచారాలు జరగటానికి ఒక కారణం
గత ప్రభుత్వాల హయాంలో ఏపీ లో మద్యం ఏరులై పారింది అని, ఇలాంటి అత్యాచారాలు జరగడానికి మద్యం కూడా ఒక కారణమని రజిని పేర్కొన్నారు. గతంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో మహిళలు హైవే బస్టాండ్ ల నుండి ఇళ్లకు వెళ్లాలంటే ఎంతో భయపడే వారిని, కానీ ఇప్పుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్యంపై నియంత్రణ తీసుకు వచ్చాక అలాంటి భయం లేకుండా మహిళలు రాత్రి ఎనిమిది తర్వాత కూడా ప్రయాణాలు చేయగలుగుతున్నారని రజనీ పేర్కొన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర న్యాయం అందించాలి
నేరం జరగకుండా ముందు మైండ్ సెట్ లో మార్పు తీసుకువచ్చి ప్రయత్నం చేయాలని చెప్పిన రజిని, ఒకవేళ నేరం జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన న్యాయం అందించాలని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోని శాంతిపురం లో టీడీపీ వైసీపీ నేతల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఒక మహిళను వివస్త్రను చేశారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
చంద్రబాబు మహిళా భద్రత కోసం ఏం చేశారని రజనీ ప్రశ్న
మహిళల పట్ల గత ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి, ప్రస్తుత పాలక ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి చాలా వ్యత్యాసం ఉందని రజనీ పేర్కొన్నారు. మహిళల భద్రతకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లో ఉన్న చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఏమీ చేయలేకపోయారని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. కనీసం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయారు అంటూ రజనీ ఎద్దేవా చేశారు.
మద్యపానం నియంత్రించి ఉంటే దిశా ఘటన జరిగేది కాకపోవచ్చు అన్న రజనీ
మద్యపానాన్ని నియంత్రించి ఉంటే దిశ సామూహిక అత్యాచార ఘటన జరిగేది కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏపీలో మద్య నియంత్రణ వల్ల మహిళలకు రక్షణ పెరిగిందని అది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని విడుదల రజిని పేర్కొన్నారు. ఇక ఏపీ శాసన్ సభలో మహిళా భద్రతపై నేడు జరుగుతున్న చర్చలో వివిధ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ సర్కార్ మహిళా భద్రత విషయంలో కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. తద్వారా కఠిన శిక్షలు విధించేలా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.