సుజయ ఎఫెక్ట్: ఒత్తిడిలో జగన్, ఆ మంత్రులపై రోజా ఫోకస్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్' ధాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడిలో కూరుకుపోయింది. ఇప్పటికే పదకొండు మంది వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరికొంతమంది ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు ఓ వైపు జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు వారు వెళ్లిపోతే వారిని ధాటిగా ఎదుర్కొనే నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం వైసిపిని ఒత్తిడిలోకి నెట్టివేసింది.
తమ పార్టీ నుంచి టిడిపిలోకు వెళ్తున్న ఎమ్మెల్యేల పైన, వారిని చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర నేతల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు దుమ్మెత్తి పోస్తున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ చేరికలు మాత్రం ఆగడం లేదు.
ఉత్తరాంధ్ర నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, మరో ఇద్దరు వైసిపిని వీడి టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. సుజయ చేరిక ఖరారైంది. ఆయన మరో మూడు రోజుల్లో సైకిల్ ఎక్కనున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో నగరి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అంటేనే అరికాలి పైన లేచే రోజా పార్టీ ఉత్తరాంధ్ర పైన ఫోకస్ పెట్టారు. ఆమె ఆదివారం విశాఖలో గుడివాడ అమర్నాథ్ చేస్తున్న దీక్షకు మద్దతు పలికారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఆయన నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారు.
ఆయన దీక్షకు రోజా మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. రైల్వే జోన్ ఇవ్వాల్సింది కేంద్రం. అయితే ఆమె ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర మంత్రులపై నిప్పులు చెరిగారు.
ఉత్తరాంధ్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావులను ఆమె టార్గెట్ చేశారు. విశాఖ రైల్వే జోన్ టిడిపి ప్రభుత్వ వైఫల్యంగా మండిపడ్డారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర మంత్రులపై దుమ్మెత్తి పోశారు. ఎవరికీ రాష్ట్ర అభివృద్ధి, కనీసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై శ్రద్ధ లేదని ధ్వజమెత్తారు. శ్రద్ధ ఉంటే రైల్వే జోన్ వచ్చేదన్నారు.
విశాఖకు రైల్వే జోన్ కేవలం ఉత్తరాంధ్రకు, విశాఖకు సంబంధించిన విషయం కాదని ఏపీకి సంబంధించిన అంశమన్నారు.
సినిమా ఫంక్షన్లలో తిరుగుతూ ఉండటం, సరదాగా విదేశాలకు విహారయాత్రలు తిరుగుతూ ఉండటం తప్ప గంటా అసలు ప్రజల గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు సభలో అడ్డగోలుగా మాట్లాడటం తప్ప ప్రజలకు ఒరగబెడుతోందేమి లేదన్నారు. వీరు కనీసం తమ ప్రాంతానికి రావాల్సిన రైల్వే జోన్ పైన శ్రద్ధ పెట్టడం లేదన్నారు.
ఉత్తరాంధ్రలో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో.. రోజా రావడం, ఆమె ఉత్తరాంధ్ర టిడిపి నేతలను టార్గెట్ చేయడం.. అంతా వ్యూహాత్మకంగానే కావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్రలో వైసిపి ఇమేజ్ తగ్గకుండా చేసేందుకే రోజా పర్యటనను ఉపయోగించుకున్నారని అంటున్నారు. సుజయ, ఇతర ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కనున్న నేపథ్యంలో అమర్నాథ్ దీక్షను రోజా ఉపయోగించుకున్నారని అంటున్నారు.