చంద్రబాబు కాలిలో ముల్లు గుచ్చుకుంటే పవన్ కళ్యాణ్ కంట్లో నీళ్లు; అందుకే ఇదంతా: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, పవన్ కళ్యాణ్ దీక్షలు చేయాల్సిన అవసరం లేదని, ప్రధాని మోడీ తో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకునేలా చేయాలని, కేంద్రంతో పవన్ చర్చలు జరపాలని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తో సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ ని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు.
పవన్ మాట్లాడేది ఆయనకైనా అర్ధం అవుతుందా ?
ఇక తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానిది తప్పు లేదని, సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి కేంద్ర ప్రభుత్వం తో పోరాటం చేయాలని అజ్ఞానవాసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఆయనకైనా అర్థం అవుతుందా అంటూ ప్రశ్నించారు.
జగన్ ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నారు
స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ హయాంలోదని, రాష్ట్రానికి చెందినది కాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దు అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సంవత్సరం ఫిబ్రవరి 6, మార్చి 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీకి రెండు లేఖలు రాశారని, మే 20న అసెంబ్లీ లో తీర్మానం చేశారని గుర్తు చేశారు. కేంద్రంలో భాగస్వామి కాకపోయినా సీఎం జగన్ ఎక్కడా తగ్గకుండా ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా అటు పార్లమెంటులోనూ ఇటు రాజ్యసభలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న విషయం అందరం చూస్తున్నాము అంటూ వ్యాఖ్యానించారు.
పవన్ వాస్తవాలు తెలీకుండా సినీ డ్రామా ప్లే చేస్తున్నారు
రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి నాయకత్వంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏమీ తెలియనట్టు సినిమా డ్రామాలను ప్లే చేస్తూ ఆందోళన చేయడం సబబుగా లేదని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చొరవ తీసుకుని ఉంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
బాబు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే పవన్ కంట్లో నీళ్ళు వస్తాయి
గతంలో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని పట్టుబట్టి కేంద్రమంత్రి చేయడంలో చూపిన శ్రద్ధ చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గనులను కేటాయించటంలో చూపించలేదని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఇక తన పార్టనర్ చంద్రబాబుని అనడానికి పవన్ కళ్యాణ్ కు మనసు ఒప్పదని, బాబు కాలిలో ముల్లు గుచ్చుకుంటే పవన్ కళ్యాణ్ కంట్లో నీళ్లు వస్తాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పోరాటం చేయాల్సింది బీజేపీ మీద అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమం చేస్తామని పవన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీ ఆరోగ్యానికి హానికరం
అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు వైయస్ జగన్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు సినిమాలలో డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం, రాజకీయాల్లోనూ వర్తిస్తుందని, ఆయన అలాగే ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కమర్షియల్ గా హిట్ రావాలంటే ఏ డైలాగ్స్ చెప్తే బాగుంటుంది అనేది, సినిమాలలోనే కాదు రాజకీయాల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హానికరమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ వేశారు లేళ్ళ అప్పి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి పవన్ కళ్యాణ్ హానికరమని ప్రజలు అంటున్నారని ఆయన దుయ్యబట్టారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు
ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేసిన నాటి నుండి వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. హోంమంత్రి సుచరిత, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ తదితరులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ చెయ్యాల్సింది దీక్షలు కాదని తేల్చి చెప్పారు. కేంద్రాన్ని అడగాల్సిన పవన్ అది మానేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చెయ్యటం సమంజసం కాదన్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ఆ పని చేస్తే బాగుంటుందని పలువురు వైసీపీ నేతలు, మంత్రులు హితవు పలికారు.