ఏపీలో నేడు, రేపు పలు జిల్లాల్లో..
Rains in AP: కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఫర్వాలేదనిపించాయి. ఇదే పరిస్థితి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీర ప్రాంత జిల్లాలు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు.
దక్షిణ కోస్తా తీర ప్రాంతాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోని నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిస్తాయని ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ వివరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద నిల్చోకూడదని సూచించింది.
మరోవంక- గోదావరికి వరద తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 12.70 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వరద ఉధృతి తగ్గినందు వల్ల ఇక్కడ జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఇదివరకే ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో వరద తగ్గేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ కోరారు.












Click it and Unblock the Notifications