ప్రత్యేక హోదాపై మల్లగుల్లాలు: మోడీ ముందున్న మార్గమేది?
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా చిచ్చుకు శాశ్వత పరిష్కారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సముఖంగా లేని స్థితిలో దాన్ని పరిష్కరించడానికి అవసరమైన చర్యలకు మోడీ ఉపక్రమించారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడానికి ఆయన ఆలోచన చేస్తూ అందుకు అవసరమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా తమకు వ్యతిరేకంగా గళమెత్తడంతో పరిష్కారం కనుక్కోవాల్సిన అనివార్యమైన స్థితిలో కేంద్రం పడింది. ఇందులో భాగంగనే మోడీతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించడానికి ఏదో ఒకటి చేయాలనే అభిప్రాయాన్ని వెంకయ్య నాయుడు ప్రధాని వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది.
వెంకయ్య నాయుడి అభిప్రాయంతో మోడీ ఏకీభవించినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవడానికి అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, వెంకయ్యతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమైందా? ఏపీ సిఎం చంద్రబాబుతో చర్చలు జరిపిందా? అనే విషయాలపై మోడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఇంత వరకు ఆ కమిటీ సమావేశం కూడా కాలేదు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటంపై నీతి ఆయోగ్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధంచేసి ఆర్థిక శాఖకు పంపిందని, ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉన్నాయని వెంకయ్య ప్రధానికి వివరించినట్టు సమాచారం. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశంపై వెంటనే అరుణ్ జైట్లీతో సమావేశమై తదపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మోడీ సూచనలతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని వెంకయ్యనాయుడు, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనాచౌదరి పార్లమెంటు ఆవరణలోని ఆయన కార్యాలయంలోనే రెండుసార్లు సమావేశమై సమాలోచనలు జరిపారు. ఏపీకి ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనేది నిర్ణయించేందుకు తనకు మరింత సమయం కావాలని జైట్లీ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో సమావేశం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేకపోయియంది.
ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టతకు వచ్చిన తరువాత, బిజెపి నేతలు చంద్రబాబుతో సమావేమయ్యే అవకాశాలున్నాయి. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై చంద్రబాబు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడంపై బిజెపి నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబును కార్నర్ చేయాలనే ఆలోచన కూడా వారిలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదనే విషయాన్ని నిరుడే చంద్రబాబుకు బిజెపి పెద్దలు స్పష్టం చేశారు. హోదాకు బదులు అత్యధిక ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నిస్తోన్న సమయంలో, చంద్రబాబు విమర్శలు చేయడం ఏమిటనే వారంటున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా వల్ల ఏపీకి వివిధ పథకాల అమలులో 90 శాతం గ్రాంటు, పది శాతం రుణం లభిస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఏపీకి ఇంతకంటే ఎక్కువే ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వారంటున్నారు. ఏపీకి హోదా కావాలా? లేక అంతకంటే ఎక్కువ అర్థిక ప్యాకేజీ కావాలా? బిజెపి పెద్దలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్గా మారడంతో ప్రత్యేక ప్యాకేజీ, హోదా కన్నా ఎక్కువ సాయం అనే మాటలు ప్రజలకు రుచించే పరిస్థితి లేదు. దీంతో చంద్రబాబు తప్పనిసరి పరిస్థితిలో కేంద్రంపై గళమెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో ప్రత్యేక హోదా విషయాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏం చేస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.