టీ మనదే, ఏపీలో స్వాగతం: త్వరలో మోడీ, షా రాక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షాలు త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల ఎన్నికలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలతో పాటు ఏడు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు మోడీ, షాలు రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.
మోడీ, షాలు డిసెంబరులో లేదా జనవరిలో తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. అయితే, వీరిద్దరు వేర్వేరుగా పర్యటించనున్నారు. అమిత్ షా శనివారం పలు రాష్ట్రాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావుతో సహా వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదుతో పాటు ప్రతి శాసన సభ నియోజకవర్గానికి ఇంఛార్జిని నియమించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఒక్కోరోజు చొప్పున సభ్యత్వ నమోదులో తాను పాల్గొంటానని అమిత్ షా వారికి చెప్పారని వార్తలు వస్తున్నాయి.
సమీక్షలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, బాగా పని చేస్తే భవిష్యత్తు మనదేనని తెలంగాణ నేతలతో షా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోను చాలామంది ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి వస్తామంటున్నారని, బలోపేతం చేసేందుకు వారికి ఆహ్వానం పలుకుదామని చెప్పారని తెలుస్తోంది.